
పవన్ కళ్యాణ్ పవర్ స్టార్గా ఎదిగేందుకు ఎంత శ్రమించారో …రాజకీయాల్లో నిలద్రొక్కుకోవడానికి అంతకంటే ఎక్కువగానే శ్రమిస్తున్నారు. పదేళ్ళు రాజకీయాలలో అనేక అవమానాలు, అవహేళనలు, విమర్శలను ఎంతో సహనంతో భరించి చివరికి ఎపీకీ డిప్యూటీ సీఎం అనిపించుకున్నారు. పవన్ కు రాజకీయాలు తెలియవు అన్న వారికి 2024 ఎన్నికల ఫలితాలతో దిమ్మదిరిగేలా సమాధానం ఇచ్చారు. క్షేత్రస్థాయిలోనూ విరివిగా పర్యటనలు చేస్తూ…అటు పార్టీని గ్రాస్ రూట్ లెవెల్ లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తూనే ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు. అంతటితో అయిపోలేదు…తన నెక్ట్స్ టార్గెట్ ను రీచ్ అయ్యేందుకు సేనాని ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారట. తన గోల్ ని ఫిక్స్ చేసుకున్నారట. అందుకోసం జనసైనికులను సిద్ధం చేస్తున్నారట. మరి జనసేనాని వ్యూహం ఏంటి..? ఆయన నెక్ట్స్ టార్గెట్ ఏంటి? లెట్స్ వాచ్ దిస్ ఆఫ్ ది రికార్డ్.
జనసేనానికి తన బలం,బలగం పై పూర్తి అవగాహన ఉంది. అందుకే ఆయన ఒంటరిగా పోటీ చేసి వీర మరణం పొందలేనని కూడా పదే పదే చెప్తుంటారు. టీడీపీ, బీజేపీ రెండింటితో విడివిడిగా పొత్తులు పెట్టుకుని 2024 ఎన్నికల ముందు ఆ రెండు పార్టీలను కలిపిన ఘనత పవన్ దే అంటే అతిశయోక్తి కాదు. అలా కూటమి పొత్తుతో ఎన్నికల్లో ఘనవిజం సాధించారు. ఏపీకి డిప్యూటీ సీఎం అయ్యారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ ప్రజలతో మమేకం అవుతూ..పార్టీని మరింత బలోపేతం చేస్తూ ముందుకు సాగుతున్నారు. మరోవైపు సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు జనసేనాని. ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 2029 ఎన్నికలను టార్గెట్ చేశారని తెలుస్తోంది. మరి రానున్న ఎన్నికలకు పవన్ వ్యూహం ఏమిటి అంటే కచ్చితంగా పొత్తు వైపే వెళ్తారనే టాక్ జోరుగుగా వినిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబుని ఆరాధిస్తూ అభిమానిస్తున్నారు. అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీని కూడా ఎక్కువగా అభిమానిస్తున్నారు. దాంతో కూటమితోనే పొత్తులు కడతారు అని పొలిటికల్ విశ్లేషకులు అంటున్నారు. ఏపీలో వైసీపీ బలంగా ఉన్నంత వరకూ ఆ పార్టీ ప్రత్యర్ధిగా నిలిచి ఉన్నంత వరకూ కూటమి చెక్కు చెదరదు అన్నది రాజకీయపరమైన విశ్లేషణ. 2024లో వైసీపీ ఓటమి పాలు అయినా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుంది. దాంతో వైసీపీకి 2029 ఎన్నికల మీద ఆశలు ఉన్నాయి. సో ఆ ఎన్నికల్లో కూడా వైసీపీని ఓడించినప్పుడే గెలుపు సంపూర్ణం అయినట్లు అవుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
అందుకే జనసేన కూటమి బంధానికి మిత్ర ధర్మానికి కట్టుబడి పనిచేస్తుందని టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో జనసేన కచ్చితంగా రెట్టింపు సీట్లకు పోటీ చేస్తుందని అంటున్నారు. దానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. అయిదేళ్ళ పాటు అధికారంలో ఉండడం వల్ల జనసేన బలం పెంచుకోవడం, మరింతగా పార్టీని విస్తరించడం ద్వారా సీట్లను కోరే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అదే విధంగా ఏపీలో 175 నుంచి 225 సీట్లు పెరుగుతాయని అంటున్నారు. దాంతో జనసేన సీట్లు ఎక్కువ కోరుతుందని అభిప్రాయ పడుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక చూస్తే 2024లో జనసేన 21 సీట్లు తీసుకున్నా.. 2029లో 50 అసెంబ్లీ సీట్లు 5 ఎంపీ సీట్లు కోరుతుందని ప్రచారం సాగుతోంది. దాని కోసం కచ్చితంగా జనసేనకు బలం ఉన్న అసెంబ్లీ సీట్లను కనీసం 60 వరకు గుర్తించి ఇప్పటి నుంచే అక్కడ పార్టీ కార్యకలాపాలను పెంచుకోవాలని అధినాయకత్వం ఆలోచిస్తోందట. అక్కడ చురుకుగా ఉన్న నాయకత్వాన్ని గుర్తించి వారికి పార్టీ పరంగా ప్రభుత్వం పరంగా ప్రోత్సాహం ఇవ్వాలని కూడా ఆలోచిస్తున్నారట.
రానున్న నాలుగేళ్ల పాటు ఇలా గుర్తించిన అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాలలో జనసేన అధినాయకత్వం తరచూ పర్యటనలు చేస్తూ పార్టీని గ్రాస్ రూట్ లెవెల్ కి తీసుకుని పోవాలని చూస్తోందని సమాచారం. అంటే మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల మీద ఫోకస్ పెట్టడం కంటే అందులో మూడవ వంతు మీద ఫుల్ ఫోకస్ పెట్టి అక్కడ పార్టీని అభివృద్ధి చేసుకుంటే వచ్చే ఎన్నికల నాటికి బలీయంగా పార్టీ తయారు అవుతుందని భావిస్తున్నారట. ఇక మున్సిపాలిటీలు మండలాలలో కూడా పార్టీని బలోపేతం చేసేందుకు స్థానిక సంస్థల ఎన్నికలను ఒక అవకాశంగా మార్చుకోవాలని చూస్తున్నారట. ఆ ఎన్నికల్లో ఔత్సాహికులు యువతకు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు సామాజిక సమీకరణలను అమలు చేయడం ద్వారా జనసేనను పటిష్టం చేయాలని నిర్ణయించారట. మొత్తానికి చూస్తే వచ్చే ఎన్నికల్లో జనసేన 50 అసెంబ్లీ, 5 ఎంపీ సీట్లలో పోటీ చేసేలా ఇప్పటి నుంచే సేనాని ప్రణాళికలు రచిస్తున్నారని టాక్ జోరుగా వినిపిస్తోంది. మరి పవన్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే.