
కన్నడలో అనూహ్య విజయం సాధించి వసూళ్ల వర్షం కురిపించిన “అపాయవీడి హెచ్చరిక” చిత్రం “డేంజర్ బాయ్స్” పేరుతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు సన్నద్ధమవుతోంది. యశశ్విని క్రియేషన్స్ – గీతా ఫిలిమ్స్ పతాకలపై శ్రీరంగం సతీష్ కుమార్ సమర్పణలో… వి.జి.మంజునాథ్ – పూర్ణిమ ఎమ్.గౌడ్ నిర్మించిన ఈ చిత్రాన్ని అభిజిత్ తీర్ధహళ్లి తెరకెక్కించారు. వికాస్ ఉత్తయ్య, రాధా భగవతి, అశ్విన్ హసన్, రాఘవ్ కొడబాద్రి, మిథున్ తీర్ధహళ్లి ముఖ్య తారాగణంగా విజయ దుందుభి మ్రోగించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కి సంగీత దర్శకుడు – ఛాయాగ్రాహకుడు ఒక్కరే కావడం గమనార్హం. సునాద్ గౌతమ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ “డేంజర్ బాయ్స్” చిత్ర విజయంలో సముచిత పాత్ర పోషించాయి. “దండుపాళ్యం, కాంతారా” తదితర చిత్రాల కోవలో… కన్నడలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం తెలుగులోనూ అదే స్థాయి విజయాన్ని అందుకోవడం ఖాయమని చిత్ర సమర్పకులు, దర్శకనిర్మాత శ్రీరంగం సతీష్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. జూన్ ద్వితీయార్థంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న “డేంజర్ బాయ్స్” ప్రీరిలీజ్ వేడుక జూన్ 1న జరగనుంది.