
సెవెన్ హిల్స్ బ్యానర్పై వేణుదారి బేబీ నేహశ్రీ సమర్పణలో సెవెన్ హిల్స్ సతీష్ నిర్మాతగా నవీన్ కుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘సోలో బాయ్’. ఈ చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ గౌతం కృష్ణ హీరోగా నటిస్తుండగా పసుపులేటి రమ్య, శ్వేత అవస్తి హీరోయిన్లుగా నటించారు. పోసాని కృష్ణ మురళి, అనిత చౌదరి, షఫీ, ఆర్కే మామ, భద్రం, ఆనంద్ చక్రపాణి, సూర్య, ల్యాబ్ శరత్, అరుణ్ కుమార్, రజిని వర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి త్రిలోక్ సిద్దు సినిమాటోగ్రాఫర్గా పని చేయగా, జుడా సంధ్య సంగీతం అందించారు. జులై 4న సినిమా రిలీజ్ కానున్న సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది. ఆపరేషన్ సింధూర్లో అమరుడైన తెలుగు జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రుల చేతుల మీదగా ఈ చిత్ర ట్రైలర్ను లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా మురళి నాయక్ తల్లిదండ్రులు మాట్లాడుతూ… ‘‘మా ఒక్కగానొక్క కొడుకు దేశం కోసం ప్రాణాలు అర్పించడం మాకు ఎంతో గౌరవంగా ఉంది. మా కొడుకు ఈరోజు మాకు దూరమైనప్పటికీ గౌతమ్ లాంటి మరొక కొడుకు మాకు దొరికాడు. గౌతమ్ మాట్లాడుతుంటే మా అబ్బాయి మాట్లాడుతున్నట్లే ఉంది. గౌతమ్ కృష్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాము” అన్నారు.
దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ… ‘‘ఎవరైనా కొత్త నిర్మాతలు చిత్ర పరిశ్రమంలోకి వచ్చినప్పుడు ప్యాషన్తో వచ్చాము అంటారు. కానీ ఒకట్రెండు సినిమాలు తీసిన తర్వాత వెళ్ళిపోతారు. కానీ సతీష్ అలా వెళ్ళిపోయేవాడు కాదు. నిజమైన ప్యాషన్తో వచ్చి ఎంతో కష్టపడి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుత రోజులలో ఏదైతే మంచి విజయం సాధిస్తుందో అదే పెద్ద సినిమా. అంతేకానీ ఇక్కడ చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఏమీ లేదు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
దర్శకుడు నవీన్ కుమార్ మాట్లాడుతూ… ‘‘దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళి నాయక్ కుటుంబానికి మనమంతా తోడుగా ఉండాలి. సోలో బాయ్ చిత్రం మధ్య తరగతి కుటుంబాలను ప్రతిభంబిస్తూ ఉంటుంది. గౌతమ్ కృష్ణ ఎంతో అద్భుతంగా నటించారు.” అన్నారు.
సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ… ‘‘దేశం కోసం ప్రాణాలకు అర్పించిన మురళి నాయక్ కుటుంబం కోసం త్వరలో ఒక మ్యూజికల్ నైట్ జరిపి తద్వారా వచ్చే ఆదాయాన్ని వారి కుటుంబానికి అందజేయాలని అనుకుంటున్నాను. ఇక సోలో బాయ్ చిత్రం గురించి చెప్పాలంటే ముందుగా నిర్మాత సతీష్ గురించి చెప్పాలి. అతను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుండి చూస్తున్నాను. ఆయనకు సినిమా అంటే పిచ్చి. తనకు వచ్చిన ప్రతి రూపాయి సినిమా పైనే పెడతారు. అలాగే గౌతమ్ కృష్ణ ఎంతో అంకితభావంతో పనిచేసే నటుడు. భవిష్యత్తులో గౌతమ్ ఎంత ఉన్నత స్థాయికి వెళ్తాడని తెలుస్తుంది. అతడిని చూస్తుంటే ఉదయ్ కిరణ్ను చూసిన ఫీలింగ్ వస్తుంది. అతడిలాగానే వరుస విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను.” అన్నారు.
చిత్ర నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ మాట్లాడుతూ.. ‘‘సోలో బాయ్ అనగానే ఎంతోమంది ఇక్కడికి సోలోగా వచ్చి ఉన్నత స్థాయికి చేరిన వారు నాకు గుర్తొస్తారు. ఈ చిత్రంలో హీరోగా నటించిన గౌతమ్ కృష్ణ రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా, తాను కూడా కొంత డబ్బు ఖర్చుపెట్టి సినిమాను ముందుకు తీసుకుని వెళ్లాడు. సినిమా విజయం సాధించిన తర్వాతే తాను డబ్బు తీసుకుంటానన్నాడు. ఈ సినిమా ద్వారా గౌతమ్కు మంచి బ్రేక్ వచ్చి తను ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను.” అన్నారు.
హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ… ‘‘ఒక చిన్న సినిమాతో పెద్ద హిట్టు కొడితే అది ఎన్నో తరాలపాటు గుర్తుండిపోతుందని మేము నమ్మాము. ఈ సినిమాకు కంటెంట్ హీరోగా నిలుస్తుంది. ఈ సినిమాలో నేనే కాదు, నా పాత్ర ఎవరు పోషించినా కూడా సినిమా మంచి హిట్ అవుతుంది. ఈ కార్యక్రమానికి మురళీ నాయక్ కుటుంబాన్ని ముఖ్య అతిథులుగా పిలవడానికి కారణమేంటంటే ఈ చిత్రంలో సబ్జెక్ట్ చాలా బలంగా ఉంటుంది. చాలా చిన్న వయసులో మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ లాంటి వ్యక్తి కుటుంబ నేపథ్యాన్ని తెలుసుకుని తద్వారా వారిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించాలని కోరుకున్నాము. మాకు పెద్ద పెద్ద సెలబ్రిటీల కంటే ఈ కుటుంబీకులే పెద్దగా అనిపించారు. అందుకే వారిని ఆహ్వానించాము. నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చింది ప్రేక్షకులు మాత్రమే. కాబట్టి ఇకపై వీరందరి కోసం ఏదో ఒకటి చేయాలని చాలా బలంగా ఒక నిర్ణయం తీసుకున్నాను. సమవర్తి అనే ట్రస్టు ద్వారా నాకు వచ్చే ప్రతి సంపాదనలోనూ సగం ఆ ట్రస్టుకు అందజేయాలని నిర్ణయించుకున్నాను. అలాగే బిగ్ బాస్ ద్వారా వచ్చిన డబ్బులో సగం ఆ ట్రస్టు ద్వారా ముందుగా ఒక లక్ష రూపాయలు మురళి నాయక్ గారి కుటుంబానికి అందజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఈ ట్రస్ట్ ద్వారా వీలైనంతమందికి నేను సహాయం చేయాలనుకుంటున్నాను. ప్రతి నెల నేను ఆ ట్రస్ట్ ద్వారా చేసే సహాయాన్ని నా సోషల్ మీడియా హ్యాండిల్స్లో పెడతాను” అంటూ ముగించారు.