
శ్రీ వేంకటేశ్వరుని పాదసేవకే జీవితాన్ని అంకితం చేసుకున్న గొప్ప భక్తురాలు.. తరిగొండ వెంగమాంబ. అన్నమయ్య మార్గాన్ని అనుసరించి ఆపదమొక్కులవాడిని అద్భుత సంకీర్తనలతో అర్చించింది. చిత్తూరు జిల్లా వాయల్పాడు దగ్గరలో తరిగొండలో జన్మించింది వెంగమాంబ. చిన్నతనంలోనే భక్తి భావం కలిగి ఉంది. అలా ఆమె నరసింహస్వామి భక్తురాలైంది. బాల వితంతువు అయ్యింది. స్వీయ ఆధ్యాత్మిక సాధనలతో యోగినిగా మారింది. వైధవ్యం వల్ల ఉన్న ఊర్లో ఎదురవుతున్న అవమానాలను తట్టుకోలేక తరిగొండ నుంచి అరణ్యమార్గంలో తిరుమలకు చేరుకుంది.
ఆ వేంకటేశుని దర్శించి పులకించిపోయింది.
ఆ తన్మయంతో ‘వేంకటాచల మాహాత్మ్యం’ను రచించింది. స్వామి సేవ, భక్తిరచనలతో ఆమె తెలియకుండా కాలం గడపసాగింది. శ్రీనివాసుని భక్తుడైన హాథీరామా బాబాశిష్యులు తిరుమల కొండపై ఆలయానికి సమీపంలోనే ఆమెకి నివాస స్థలం ఏర్పాటు చేశారు. అక్కడ వెంగమాంబ పూల మొక్కలను పెంచి.. నిత్యం పూలమాలలు, తులసిదండలు తీసుకెళ్లి స్వామికి సమర్పించేది.
ఒకరోజు వెంగమాంబ తులసికోట తిన్నెపై ఒంటికాలిపై నిలబడి, ఆనందనిలయ శిఖరాన్ని చూస్తూ తన్మయురాలైంది. శ్రీనివాసుణ్ణి శ్రీకృష్ణ పరమాత్ముడిగా భావిస్తూ ‘శ్రీవేంకటేశ్వర కృష్ణమంజరి’ అనే స్తోత్రాన్ని గానం చేసింది. అలాగే విష్ణుపారిజాతం తదితర యక్షగానాలు, అష్టాంగయోగం, వాశిష్ఠ రామాయణ ద్విపదకావ్యం, తత్త్వకీర్తనలు మొదలైనవి రచించింది.
గానంతో, రచనలతో, యోగధ్యాన సాధనలతో ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఆమె ప్రయత్నించింది. వెంగమాంబ ప్రాభవం ఎంతలా పెరిగిందంటే.. అన్నమయ్య వంశీకులు దగ్గరుండి.. వెంగమాంబను ఆహ్వానించి తిరుమలలో వరాహస్వామి ఆలయం వెనుక తమ నివాసంలో కొంతభాగాన్ని ఆమెకు కేటాయించారు. వెంగమాంబ తిరుమల వచ్చినప్పటి నుంచి.. రోజూ సాయంకాలం స్వామి ఏకాంతసేవ సమయానికి ఆనంద నిలయానికి చేరుకునేది.
శ్రీనివాసుడికి స్వయంగా కర్పూర హారతి ఇచ్చేది. దీన్నే ముత్యాలహారతి, తరిగొండవారి హారతి అంటారు. తిరుమలలో నేటికీ రాత్రి చిట్టచివరగా ఏకాంతసేవలో తాళ్లపాక అన్నమయ్య వంశీయులు జోలపాటలు పాడుతుండగా తరిగొండ వెంగమాంబ ఆరంభించిన ముత్యాల హారతిని స్వామివారికి సమర్పిస్తారు. తర్వాత ఆనందనిలయ బంగారు వాకిళ్లు మూసేస్తారు. అందుకే ‘తాళ్లపాకవారి లాలి, తరిగొండవారి హారతి’ అనే నానుడి ఏర్పడింది.
వెంగమాంబ తన రచనలన్నింటినీ బృందావనంలో చేసేవారు. శిష్యులు కూడా అక్కడే ఉండి ఆమె వద్ద యోగం, సాహిత్యం తదితర విషయాలను అభ్యసించేవారు. 1730వ సంవత్సరంలో జన్మించిన వెంగమాంబ రాఘవేంద్రస్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి లాగా తన బృందావనంలోనే 1817లో సజీవ సమాధి చెందారు.