
శిలాదుని శాపంతో కైలాసాన్ని విడిచి భువిపైకి దిగివచ్చిన తల్లి. అన్నదమ్ముల తోడుగా పుట్టి గోమాతను పూజించితిన కల్పవల్లి. గత జన్మ శాపంతో పెళ్ళికి ముందే గర్భాన్ని దాల్చి ఎన్నెన్నో కష్టాలను అనుభవించిన లోకమాత.ఊరి ప్రజలు అమవానించారు.. అన్నదమ్ములే హతమార్చేందుకు కుట్ర పన్నారు. అగ్నికి ఆహుతినిచ్చారు. భగభగమండే అన్ని నుంచి ఆదిశక్తిగా అవతరించింది పార్వతీ దేవి. రాళ్ల గుట్టలో రత్నాల తల్లై భక్తుల కల్పవల్లిగా విలాసిల్లుతోంది. మరి పార్వతీదేవి శాపానికిగురై శ్రీలక్ష్మీ అమ్మవారుగా ఎందుకు జన్మించింది? ఆమె ఎందుకు కష్టాలు అనుభవించింది? ఆమెను శపించింది ఎవరు? ఈ ఆలయం ఎక్కడ వెలసింది? ఆలయ చరిత్ర ఏమిటి?తెలుసుకుందాం పదండి.
పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలంలోని అడిగొప్పల గ్రామ సమీపంలోని నిదానం పాడులో మహిమాన్విత శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మి అమ్మవారు వెలిసారు. పల్నాటి ప్రజల ఆరాధ్య దైవం ఈ అమ్మవారు. రెండు తెలుగు రాష్ట్రాల లో అనేక మంది భక్తులకు కోర్కెలు తీర్చే అమ్మవారుగా ప్రసిద్ధి చెందారు. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది.
ద్వాపర యుగాంతంలో కైలాసంలో పార్వతి పరమేశ్వరులు కొలువుదీరివుండగా నారదుడు, నందీశ్వరుని తండ్రి శిలాద మహర్షి దర్శనానికి వచ్చారు.అప్పుడు నారద మహర్షి శివునితో స్వామి మీ పుణ్య దంపతుల నాట్యం చూడాలని కోరిక గా ఉంది అని కోరాడు. దానికి శివుడు నారదా..ఈ రోజు మా బదులు నందీశ్వరుడు నాట్యం చేస్తారు చూడండి అని చెప్పి నందీశ్వరునితో నాట్యం చేయమని ఆజ్ఞాపిస్తారు. శివుని ఆజ్ఞానుసారం నందీశ్వరుడు నాట్యం చేయడం మొదలు పెట్టాడు. అయతే లయబద్దం లేని నందీశ్వరుడి నాట్యం చూసి పార్వతి దేవి పగలబడి నవ్వుతుంటుంది. అది అది చూసి నారదుడు..నందీశ్వరుని తండ్రి శిలాదునితో చూసావా మునివర్యా.. .పార్వతీ దేవి నీ కుమారుడి నాట్యం చూసి పగలబడి నవ్వుతుంది అని ఆయన్ని రెచ్చగొడతాడు. అది చూసి కోపోద్రేకుడైన శిలాదుడు పార్వతీ దేవితో తల్లీ ఎందుకు నా పుత్రుడు నాట్యం చూసి హేళన చేస్తున్నావు అని ప్రశ్నిస్తాడు. దానికి పార్వతి దేవి లయబద్దంలేని నాట్యం వింత రూపం చూసి నవ్వు వచ్చిందని అంటుంది. అసలు ఈ నాలుగు కాళ్లతో వున్న వింత ఆకారంను గర్భాన మోసిన నీ భార్య అసలు మనిషేనా? అంటూ నవ్వుతూ జవాబు ఇస్తుంది. దానికి పట్టరాని కోపంతో శిలాదుడు ..పరమ శివుని భార్య అనే గర్వంతో మునీశ్వరులను వారి భార్యలను అవమానిస్తావా…అంటు భూలోకంలో ఏశక్తులు లేకుండా మానవరూపంలో పుట్టి 12 సంవత్సరాల వయస్సులో వివాహం కాకుండానే అకాల గర్బం ధరించి అందరి చేత నవ్వులు పాలు, అవమానానికి గురై…చివరికి నీ ఇంటి వారే నిన్ను అవమానించి అగ్నిలో ఆహుతి చేస్తారని శపించాడు.
శిలాదుడు శపించడంతో పార్వతీ దేవి శిలాద మునిని క్షమించమని ప్రాధేయపడుతుంది. అప్పుడు శిలాదుడు…భూలోకంలో పరమ నిష్టాగరిష్టుడై శివున్ని అనునిత్యం కొలిచే యాగంటి అనే కమ్మ వారి కులంలో జన్మిస్తావని, నీకన్నా ముందే కైలాసంలో కామధేనువు వారి ఇంట గోవుగా జన్మిస్తుంది…అనునిత్యం ఆ కామధేనువును కొలువు….ఆ గోవు పంచకం వల్ల నీకు మాయా గర్బం వస్తుంది…..నీ గర్బంలో నందీశ్వరుడు సూక్ష్మరూపం లో ఉంటాడు.. అని పలుకుతూ….మీ మానవ రూపం అంతంతో శాప విముక్తి కలుగుతుందని చెబుతాడు. ఇదంతా చూస్తున్న పరవశివుడు మౌనంగా ఉండటం గ్రహించి….పార్వతి దేవి ఏమిటి స్వామి ఇంత జరుగుతున్నా మీరు నోరు మెదపకుండా అలా ఉన్నారు….నందీశ్వరుడు నా కుమారుడు లాంటి వాడు అతన్ని చూసి నేను నవ్వటం ఏమిటి…ఈ శాపం ఏమిటి అని ప్రశ్నిస్తుంది. దానికి పరమ శివుడు.. మరిచితివా పార్వతీ,గజాసుర మరణం తర్వాత నందీశ్వరుడు నీ గర్భాన జన్మించాలని వరం కోరగా…..నువ్వు వరం ప్రసాదించావు… ఇప్పుడు జరిగినదంతా విష్ణుమాయ. లోక కళ్యాణం కోసం నువ్వు భూమి పై అవతరించ వలసిన సమయం
ఆసన్నమైంది. దిగులు చెందకు …నీకు రక్షణగా నాగేంద్రుడు కూడా ఆగ్రామంలో వెలుస్తాడు అని శివుడు పార్వతీ దేవితో చెబుతాడు. నందీశ్వరుడు గోమాత రూపంలో నీ గర్భాన జన్మించగానే నీకు శాప విమోచనం కలుగుతుంది అని తెలిపారు.
అలా ఈ శాపం వల్ల పార్వతీ దేవి నిదానంపాడులో ఉన్న యాగంటి రామయ్య,సుగుణమ్మ దంపతులకు సంతాన వ్రతం ఆచరించగా 15 వ శతాబ్దంలో జన్మించింది. ఆమెకు శ్రీలక్ష్మి అని నామకరణం చేసారు. శ్రీలక్ష్మి జననానికి ముందే రామయ్య ఇంట కామధేనువు ఒక గోమాత కు జన్మించింది. రామయ్య ఊరికి పెద్దగా వ్యవహరించేవారు. గ్రామంలో బాగోగులు చూసూకునేవారు. ఆయనకు మూర్తయ్య,వెంకయ్య, నరసయ్య,లింగయ్య అనే నలుగురు మగ సంతానం ఉన్నారు. వీరంతా శ్రీలక్ష్మి ని బాగా గారాబంగా పెంచేవారు. ప్రతి రోజు శ్రీలక్ష్మి గోశాలకు వెళ్లి, కామధేనువుకు నమస్కరించి,3 ప్రదక్షినలు చేసి కామధేనువు గో పంచకాన్ని స్వీకరించేది. అయితే ఈ విషయం తల్లిదండ్రులకు తెలియదు.
ఇలా 12 సంవత్సరాల వరకు అనునిత్యం గోపంచకం సేవించేది. ఒకరోజు అదే అలవాటుతో గోశాలకు వెళ్లి ఆంబోతు వీర్యకణాలతో ఉన్న పంచకం శ్రీలక్ష్మి సేవిస్తుంది. ఆమెకున్న శాపపలం వలన ఆమె గర్బం దాల్చుతుంది. రాను రాను శ్రీలక్ష్మి శరీరంలో మార్పులను ఇంటిలోని వారెవరూ గమనించలేదు. కానీ.. ఒక రోజు రోజు లాగే గోశాల కు వెళ్తున్న శ్రీలక్ష్మి ని చూసి రచ్చబండ పై కూర్చున్న పెద్దలు ఆమెను గమనించి వివాహాం కూడా కాని రామయ్య గారి అమ్మాయి ఇలా చేస్తే….మిగతా వారికి గ్రామ పెద్ద అయిన ఆయన ఏమి న్యాయం చెప్తారు..అంటూ ఆయన్ను పిలిచి విషయం చెబుతారు.
విషయం తెలుసుకున్న రామయ్య ఇంటికి వెళ్లి శ్రీలక్ష్మిని పరిశీలించి కోపంతో రగిలిపోతారు. తమ వంశ పరువు తీసావని దూషిస్తారు. అప్పుడు శ్రీలక్ష్మీ… తండ్రి నాకు ఏ పాపం తెలియదు అంటూ విలపిస్తుంది. ..ఇదంతా దైవ లీల అని చెబుతుంది… కానీ వారెవరూ నమ్మరు. ఆనోటా,ఈ నోటా ఈ విషయం తెలుసుకున్న అన్నలు శ్రీలక్ష్మి తమ పరువు తీసిందని ఆమెను అంతం చేస్తే కాని పరువు నిలబడుతుందని భావించి తమ తల్లితండ్రులు ఇంట్లో లేని సమయంలో ఒక ఆదివారం రోజు ఆమెతో తాము పొలంకు వెళ్తున్నామని….మధ్యహ్నం భోజనం పొలానికి తీసుకురమ్మని చెప్పి వెళ్తారు… శ్రీలక్ష్మి భోజనం తయారు చేసి గోశాలకు వెళ్లి కామధేనువు కి నమస్కరించి పొలానికి బయలుదేరగా ..అప్పుడు కామధేనువు శ్రీలక్ష్మితో మీ అన్నలు నిన్ను అ గ్ని దహనం చేయాలని కుట్ర చేసారు..అక్కడికి వెళ్లకు అని బతిమిలాడుతుంది..అయితే
దానికి తన అన్నల మాట తాను కాదనలేనని చెప్పి, ఆమె పొలం దగ్గరికి బయలుదేరుతుంది. మార్గ మద్యలో నాగేంద్రుడు ప్రత్యక్ష్యమై పొలానికి వెళ్ళవద్దని శ్రీలక్ష్మితో వారిస్తాడు. కానీ అతని మాటలు వినక పొలానికి బయలుదేరుతుంది.
ఇక అన్నలలో చిన్న అన్న అయిన లింగయ్యకు తన అన్నలు శ్రీలక్ష్మిని అంతం చేయాలనుకుంటున్నారని తెలుసుకుని..అన్నలారా! శ్రీలక్ష్మికి గర్బం దైవ లీల అని చెబుతాడు. ఆమెను ఏమి చేయవద్దని విజ్ఞప్తి చేస్తాడు. దానికి మిగతా ముగ్గురు అన్నలు శ్రీలక్ష్మిని ఏమి చేయమని చెప్పి తమ్ముడిని బావి దగ్గరకు నీరు తెమ్మని పంపిస్తారు. ఇంతలో శ్రీలక్ష్మి పొలానికి భోజనం తీసుకువస్తుంది. తన అన్నలకు కామదేనువు,నాగరాజు కూడా విషయం చెప్పే ప్రయత్నం చేస్తారు. వారి మాటలు కూడా అన్నలు నమ్మలేదు… నువ్వు పత్తి మండే పైకి ఎక్కు మేము నీకు అందిస్తాము అంటూ శ్రీలక్ష్మిని పైకి ఎక్కిస్తారు. ఆమె పైకి ఎక్కగానే చుట్టు మంటలు పెడతారు. అప్పుడు శ్రీ లక్ష్మీ అన్నలారా నేను ఏ పాపం ఎరుగను నన్ను ఇలా దహనం చేయటం మీకు భావ్యమా….అంటూ విలపిస్తూ శ్రీలక్ష్మి అగ్ని కి ఆహుతి అయ్యింది.
శ్రీలక్ష్మీ అగ్నికి ఆహుతవ్వడం చూసి వెంటనే నాగరాజు కూడా శ్రీలక్ష్మీ తో పాటు అగ్నిలో దూకాడు. శ్రీలక్ష్మీ మంటల్లో కాలుతున్నప్పుడే ఆయన గర్బం నాలుగు ముక్కలు గా చీలి నాలుగు కాళ్లతో శిరస్సు మీద మచ్చతో ఒక కోడె దూడ మరణించి భూమి పై పడింది. ఈ దృశ్యం చూసిన అన్నలు తమ కంటి చూపును కోల్పోయారు. గోశాల లో కామదేనువు తాడు తెంపుకుని ఆ ప్రదేశానికి వచ్చి అంబా అంబా! అంటూ అరుస్తూ అగ్ని లో దూకి తాను ఆహుతి అయ్యింది. ఆ అరుపులు విని పరిగెత్తుకొచ్చిన లింగయ్య భాధతొ ఏడుస్తూ ఎంత పని చేసారు అన్నలారా! అంటూపెద్దగా రోదించసాగాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పరిగెత్తుకుంటూ ఆ ప్రదేశానికి చేరురుకున్నారు. అదే సమయంలో భీకర శబ్దంతో భూమి బారెడు వైశాల్యంతో చీలి బంగారు విగ్రహం బయటకు వచ్చింది. ఆమె శ్రీలక్ష్మీ అమ్మావారు.
అప్పుడు శ్రీ లక్ష్మీ అమ్మవారు ఓ గ్రామ ప్రజలారా. నేను యాగంటి వారి ఇంట కారణ జన్మురాలిగా జన్మించాను. వారికి ఈ విషయం తెలియక దహనం చేసారు. ఆదివారం నన్ను దహనంచేసారు కావున ప్రతి ఆదివారం నాడు నన్ను పసుప,కుంకుమతో పూజించండి…..నన్ను దహనం చేసిన అన్నల వంశం నాశనమై ఒక్క లింగయ్య వంశం మాత్రం వర్ధిల్లితుంది… అని చెప్పి…భూమిలోకి సువర్ణ శిలా విగ్రహంవెళ్లిపోతూ…నాకు ఎటువంటి రూపం కల్పించరాదని,నన్ను మండుటెండలో అగ్ని దహనం చేసిన కారణంగా నాకు ఆలయం కట్టవద్దని,నన్ను ఎండలో ఉండే భక్తులు దర్శించుకోవాలని…నేను ఇక్కడ భూగర్బంలో నిదానం పాటి అమ్మవారిగా యజ్ఞ నిక్షిప్తమయ్యి ఉంటానని ..నన్ను బయటకు తీసే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించింది. తనతో పాటు అగ్ని కి ఆహుతైన కామదేనువు ను మూడు పసుపు ముద్దలు గా చేసి మిరియాల గ్రామస్తులైన బత్తుల వంశంకు చెందిన యాదవ కులస్తులకు ఇలవేల్పుగా…ఆవుదేవర అనే నామంతో కొలవాలని చెప్పింది. అందుకే ప్రతి సంవత్సరం మిరియాలలో నేటికి ఉత్సవాలు 5 రోజులు నిర్వహిస్తారు. ఆవుల పబ్బం గా గొప్పగా వేడుకలు చేస్తారు. ఇక నన్ను భక్తితో కొలిచేవారిని స్వప్నంలో కనిపించి వారి కోర్కెలు తీరుస్తానాని…నా మహామంత్రం జయజయ లక్ష్మి! నిదానంపాటి శ్రీలక్ష్మి అంటూ పూజించిన వారికి సకల సౌభాగ్యాలు ఇస్తానని చెప్పి సువర్ణ శిలా విగ్రహం భూమిలొకి వెళ్లిపోతూ తన అన్నలకు నేత్ర దృష్టి ప్రసాదిస్తుంది. అప్పటి నుండి శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ గా ఆమె దగ్ధమైన ప్రదేశంలో పూజలు అందుకుంటూ భక్తుల పాలిట కొంగుబంగారంగా నిలిచింది. శుద్ధ పాల్గుణ పౌర్ణమి కి దగ్గరగా ఉండే ఆదివారం ప్రతి సంవత్సరం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. మెదట తన పుట్టింటి యాగంటి వారి కుంకుమ బండి ప్రభ వస్తుంది, అనేక గ్రామాల నుండి వేల సంఖ్యలో భక్తులు వస్తారు.
అదే విధంగా ప్రతి ఆదివారం కూడా అధిక సంఖ్యలో భక్తులు నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటుంటారు. ఇప్పటికే అమ్మవారికి రూపం ఉండదు..కానీ ఆమె మహిమలు అన్ని చోట్ల కు విస్తరించింది. సంతానంలేని వారు ఈ తల్లి ని దర్శిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని నమ్మకం. కొత్త వాహానాలు కొన్నవారు ఈ తల్లి ని దర్శించి వాహానానికి పూజలు చేస్తే ఎటువంటి ప్రమాదాలు జరగవని చెప్తారు….ఈ ప్రాంతంలో అటవీ వాతావరణం చూడ చక్క గా ఉంటుంధి….భక్తులు అమ్మవారిని దర్శించి భక్తితో ప్రార్ధించి మొక్కుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయనడంతో ఈ విషయం ఆ నోటా,ఈనోటా ప్రాకి ఒకప్పుడు సాధారణ రద్దీ ఉండే అమ్మ ఆలయం ప్రస్తుతం ప్రతి ఆదివారం భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంటుంది. ఈ ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడు అమ్మను అడిగిన ప్రతి కోరిక తీరిందని చెబుతుంటాడు. అందుకే మళ్లీ అమ్మను చూసేందుకు వచ్చామని చెబుతారు. అద్బుత మహిమలు కలిగిన నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారిని తప్పక దర్శించండి. ఇలాంటి మహిమాన్వితమైన, చారిత్రాత్మమైన మరిన్ని ఆలయాల గురించి తెలుసుకోవాలంటే మెగా9 టీవీని ఫాలో అవ్వండి.