
ద్రాక్ష ఆరోగ్యకరమైన పండ్లలో ఒకటి. తినేందుకు చాలా రుచిగా.. తియ్యగా, పుల్లగా, జ్యూసీగా ఉండే ఈ ద్రాక్ష పండ్లు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. అయితే ద్రాక్ష పండ్లలో ఉండే పోషకాల గురించి, ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం:
సీజన్ వారిగా లభించే పండ్లలో ద్రాక్ష పండ్లు కూడా ఒకటి. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ద్రాక్షలో రెస్వెరాట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్, రక్తపోటును నియంత్రించడంలో బాగా హెల్ప్ చేస్తుంది.
శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే మన శరీరంలోని ధమనులకు ఆటంకం కలుగుతుంది. అదే ద్రాక్ష తింటే శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. కాబట్టి ధమనులు శుభ్రంగా ఉంటాయి. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు ద్రాక్షపండ్లు బాగా తీసుకోవడం మంచిది.
అలాగే ద్రాక్ష పండ్లలో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఎప్పుడైనా జ్వరం చేసినప్పుడు, ఆరోగ్యం బాగాలేనప్పుడు యాపిల్ లాంటి పండ్లతో పాటు ద్రాక్ష పండ్లు బాగా తినమని చెబుతుంటారు.
ద్రాక్షలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ద్రాక్షపై పొట్టు మాత్రమే కాకుండా ద్రాక్ష లోపలి కండలో కూడా ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్దకం నుంచి ఉపశమనం పొందడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మలబద్దకం సమస్యతో ఇబ్బందిపడేవారు రోజూ ఒక కప్పు ద్రాక్ష పండ్లు తింటే ఈ సమస్య తగ్గుతుంది.
ద్రాక్ష పండ్లు హెల్త్ తో పాటు చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఈ పండ్లలో ఉండే పోషకాలు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. ద్రాక్ష పండ్లలో ఉండే సమ్మేళనాలు రక్తాన్ని శుద్ది చేస్తాయి. దీనివల్ల రక్తంలో ఉండే వ్యర్థ పదార్థాలు బయటకు పోయి.. చర్మం తాజాగా, మచ్చలు లేకుండా క్లియర్ గా ఉంటుంది.
ద్రాక్షలో ఉండే లుటిన్, జియాక్సంతిన్ అనే సమ్మేళనాలు కంటి చూపును సైతం మెరుగుపరుస్తాయి. కంటిచూపు బలహీనంగా ఉన్నవారు, ఎక్కువసేపు కంప్యూటర్ ముందు పని చేయాల్సినవారు కంటి అలసటను తగ్గించుకునేందుకు వీటిని తీసుకోవడం ఉత్తమం.