వేములవాడ దేవాలయంలో కోడెల మరణం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టం.!

మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్:
కోడెలను కాపాడడం ప్రభుత్వానికి చేతకాకపోతే బిఆర్ఎస్ కి కోడెల సంరక్షణ బాధ్యత అప్పగించండి. మేం కాపాడుకుంటాం. రేవంత్ రెడ్డి నిర్లక్ష్య వైఖరి వల్ల రాష్ట్రానికి అరిష్టం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు కింద ఎకరాకు 18 వేల రూపాయలు రైతులకు బకాయి పడింది.

క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకొని వెంటనే బకాయి పడిన 18 వేల రూపాయలను విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం· నోరు కట్టుకుంటే ఏడాదిలో 40 వేల కోట్ల రుణమాఫీ పూర్తి చేస్తానన్నావు. మరి ఎందుకు నోరు కట్టుకోవడం లేదు రేవంత్ రెడ్డి. వడ్ల కుప్పల మీద రైతుల ఊపిరి ఆగిపోతుంటే, ఈ ప్రభుత్వానికి అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతులపై లేదు.

సన్న వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం 1100 కోట్లు బకాయి పడింది. వెంటనే రైతులకు 1100 కోట్ల బకాయి డబ్బులు విడుదల చేయాలంటే బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. 48 గంటలు కాదు 48 రోజులు గడిచినా రైతులకు వడ్ల కొనుగోలు డబ్బులు రాలేదు. జొన్నల కొనుగోలు జరిగి రెండు నెలలు గడిచినా ఒక రూపాయి కూడా రైతులకు ఈ ప్రభుత్వం చెల్లించలేదు.

రీజనల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇచ్చేందుకు హడ్కో నుండి తెచ్చిన 3000 కోట్లను బడా కాంట్రాక్టర్లకు ఇచ్చారు. రీజనల్ రింగ్ రోడ్డులో భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. నష్టపరిహారం అందక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నర్సాపూర్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.


వేములవాడ దేవాలయంలో కోడెల మరణం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టం. వారం రోజుల్లో భక్తులు సమర్పించిన కోడెలు మరణించడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. రోజూ కోడెలు చనిపోతున్నా కూడా ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేకపోగా కనీస స్పందన కూడా లేదు.

రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం కోడెలకు గడ్డిపెట్టే పరిస్థితి లేదా? ఎందుకు ఇంత నిర్లక్ష్యం. కలెక్టర్, అధికారులు, దేవదాయ శాఖ, పశుసంవర్ధక శాఖ ఏం చేస్తున్నట్టు?
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ దేవస్థాన పరిస్థితి ఇలా ఉంటే ఎలా? కోడెలను కాపాడలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.

కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకాకపోతే చెప్పండి. బీఆర్ఎస్ పార్టీకి కోడెల సంరక్షణ బాధ్యత అప్పగించండి. మీకు ప్రజలు అంటే లెక్కలేదు. దేవుళ్ళంటే లెక్కలేదు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ రాసిచ్చి ప్రజల్ని మోసం చేశారు. 500 రోజులు దాటినా ఇప్పటివరకు 6 గ్యారంటీల అమలుకు దిక్కులేదు.

దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేస్తామని రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేశారు. రేవంత్ రెడ్డి నీ నిర్లక్ష్య వైఖరి వల్ల రాష్ట్రానికి అరిష్టం జరుగుతుంది. రేవంత్ రెడ్డి పాలన అంతా ఆగమాగం. ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నవా రేవంత్ రెడ్డి.

కేసీఆర్ గారేమో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపాడు. రేవంత్ రెడ్డి అబద్ధాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపాడు. మొదటి సంతకంతో రుణమాఫీ చేస్తానని, నోరు కట్టుకుంటే ఏడాదిలో 40 వేల కోట్ల రుణమాఫీ పూర్తి చేస్తానన్నావు. ఎందుకు నోరు కట్టుకోవడం లేదు రేవంత్ రెడ్డి . 40 వేల కోట్ల రుణమాఫీ ఇప్పటివరకు చేయలేదు.

పంటలు కోతకొచ్చి అమ్ముకున్నా ఇప్పటివరకు రైతులకు యాసంగి రైతుబంధు రాలేదు. వడ్ల కుప్పల మీద రైతుల ఊపిరి ఆగిపోతుంటే పిట్టల్లా రైతులు రాలిపోతుంటే, రేవంత్ రెడ్డికి అందాల పోటీ మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదు. కనీసం ఆ రైతు కుటుంబాలను ముఖ్యమంత్రి కానీ మంత్రులు గాని పరామర్శించకపోవడం దుర్మార్గం. రైతు బీమా ప్రీమియం రేవంత్ రెడ్డి కట్టకపోవడం వల్ల చనిపోయిన రైతు కుటుంబాలకు రైతు భీమా రావడం లేదు.

కొత్త రేషన్ కార్డులు ఇస్తానని చెప్పి ఒక్క రేషన్ కార్డు ఇయ్యలేదు. ఇంద్రమ్మ ఇల్లు అన్నావు దాని ఊసు లేదు. యువ వికాసాన్ని వాయిదా వేస్తివి. రైతుబంధు వేస్తా అన్నావ్ అది వాయిదా వేస్తివి. సన్న వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం 1100 కోట్లు బకాయి పడింది. వెంటనే 1100 కోట్ల బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. 48 గంటలలో కొన్న వడ్లకు డబ్బులు వేస్తున్నాం అని చెప్పిండు ఉత్తం కుమార్ రెడ్డి. 48 రోజులు అయిపోయినా డబ్బులు రాలేదు.

ఉమ్మడి మెదక్ జిల్లా, కామారెడ్డి జిల్లా, నిజామాబాద్ జిల్లాల్లో జొన్న కొనుగోలు జరిగింది కానీ రెండు నెలలు అయినా ఒక్క రూపాయి కూడా జొన్నలకు ప్రభుత్వం విడుదల చేయలేదు. ప్రస్తుత క్యాబినెట్ మీటింగ్లో రైతుబంధు డబ్బులు మూడు పంటలకు కలిపి ఎకరాకు 18 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. పోయిన వానా కాలం 6,000 రూపాయలు, పోయిన యాసంగి 6,000 రూపాయలు, వచ్చే వానాకాలానికి 6,000 కలిపి ఎకరానికి 18 వేల రూపాయలు రైతుబంధు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం.

భట్టి విక్రమార్కగారు గత మూడు బడ్జెట్ సమావేశాల్లో రైతులు ఒక్క రూపాయి కట్టకుండా ప్రభుత్వమే డబ్బులు కట్టి పంటల బీమా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. బడ్జెట్ స్పీచ్ లో, అసెంబ్లీలో చెప్పినా కూడా అమలు చేయరా? ఇక నుండి ఒక రూపాయి తీసుకోకుండా అసెంబ్లీలో చెప్పిన మాట ప్రకారం ఈ వానాకాలం పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

జీలుగు విత్తనాలు సరఫరా చేయడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది. విత్తనాలను కూడా సరఫరా చేయడం చేతగాని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. సన్నబడ్లకు బోనస్ లేదు, వడ్లు కొనడం లేదు, రైతుబంధు లేదు, రైతు బీమా లేదు, పంటల బీమా అని రైతులను మోసం చేశారు. ఏ ఒక్క పథకం కూడా రైతుల కోసం అమలు చేయలేదు. వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులకు నిధులు విడుదల చేశామని ముఖ్యమంత్రి ప్రకటించారు కానీ ఇప్పటివరకు ఒక రూపాయి రైతులకు ఇవ్వలేదు.

రైతులంటే ఈ ప్రభుత్వానికి ఎందుకు అంత చిన్న చూపు? పదేండ్ల కేసీఆర్ పాలనలో ఏ రోజు కూడా రైతు బీమా ఆగలేదు. రైతుబంధు ఆగలేదు. రైతులకు ఇచ్చే విత్తనాలు ఆగలేదు. కాంగ్రెస్ నాయకుల సొంత ఆదాయం మీద దృష్టి పెడుతున్నారు తప్ప ప్రజల గురించి ఆలోచించడం లేదు.

విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి 2 వేల కోట్లు పెట్టిపోతే మా ప్రభుత్వ హయాంలో వాటిని చెల్లించి పథకాన్ని కొనసాగించాం. 18 నెలల్లో ఢిల్లీ నుంచి వచ్చిన డబ్బులే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ కి ఒక రూపాయి చెల్లించలేదు. అసెంబ్లీలో చెప్పి, బడ్జెట్ స్పీచ్ లో చెప్పిన మాటలకు విలువ లేకపోతే ప్రజల్లో ఏం గౌరవం ఉంటుంది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు ఫీజులు చెల్లించలేక చదువులు మధ్యలోనే ఆపే పరిస్థితి వచ్చింది. రీజనల్ రింగ్ రోడ్ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడే సాంక్షన్ అయ్యింది. కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే రీజినల్ రింగ్ రోడ్డుకి ల్యాండ్ అక్వజేషన్ జరిగింది.

ఈ ప్రభుత్వం వచ్చాక రీజనల్ రింగ్ రోడ్ లో భూములు కోల్పోయిన రైతులకు ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం చెల్లించలేదు. రీజినల్ రింగ్ రోడ్ లో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చేందుకు హడ్కో నుండి 3,000 కోట్లు అప్పు తెచ్చారు. కానీ ఒక రైతుకి కూడా చెల్లించలేదు. ఆ డబ్బుని బడా కాంట్రాక్టర్లు కట్టబెట్టారు. ప్రభుత్వ నోటిఫికేషన్ ఇచ్చినందుకు ఆ భూమిని అమ్ముకోలేకపోతున్నారు. పెళ్లికో, పిల్లలు చదువుకో అమ్ముకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

నర్సాపూర్ కొత్తపేట గ్రామానికి చెందిన కంచనపల్లి శేఖర్ అనే రైతు ఈ రోజు ఆత్మహత్యాయత్నం చేశాడు. సిద్దిపేట జిల్లా మరికొక్క మండలం నరసన్నపేట గ్రామంలో బిక్షపతి అనే రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. 18 నెలలుగా నోటిఫికేషన్ వచ్చి రీజనల్ రింగ్ రోడ్ కింద ఉన్న భూమికి డబ్బులు ఇవ్వనందుకు ఆత్మహత్య చేసుకున్నాడు. అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరిగి అలసిపోయిన రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తోంది

వేములవాడ రాజన్న ఆలయంలో కోడెలకు అన్నం పెట్టలేని ప్రభుత్వం, ఎర్రగడ్డ మానసిక వైద్యాలయంలో రోగులకు అన్నం పెట్టలేని దుస్థితి. 70 మంది మానసిక రోగులు విషాహారం తిని అనారోగ్యం పాలయ్యారు. అందులో ఒకరు చనిపోయారు. మానసిక పరిస్థితి బాగాలేక దావఖానాలో చేరిన మానసిక రోగులను సరైన భోజనం పెట్టలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది.

బీఆర్ఎస్ నాయకులను, కేసీఆర్ ని, కేటీఆర్ ని, హరీష్ రావుని అక్రమ కేసుల్లో ఇరికించే ప్రయత్నమే తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క పని కూడా చేయడం లేదు. మా ఎమ్మెల్యేలపై, కార్యకర్తలపై కేసులు పెట్టడం తప్ప రేవంత్ రెడ్డి అసలు పని చేయడం లేదు. రేపటి క్యాబినెట్ మీటింగ్లో పంటలకు రావాల్సిన డబ్బులను చెల్లించాలని మరోసారి డిమాండ్ చేస్తున్నాం.