కారు పార్టీలో హరీష్‌ vs కవిత?

గులాబీ పార్టీలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. బీఆర్ఎస్‌లో హరీష్‌రావు, కవితలపైనే కుట్రలు పన్నుతున్నారా? కావాలని ఇతర పార్టీలకు చెందిన నేతలు దుష్ప్రచారం చేస్తున్నారా? రాజకీయంగా ఎదగనివ్వకుండా అడ్డుపడుతున్నారా? డైరెక్ట్‌గా టార్గెట్ చేయకుండా చాప కింద నీరులా పావులు కదుపుతున్నారా? అసలు ఏం జరుగుతుంది? స్వయంగా నేతలే వచ్చి వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందనేది రాజకీయ వర్గాలతోపాటు పార్టీలోనూ తీవ్ర చర్చకు దారితీస్తోంది.

బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుత పరిణామాలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. పార్టీలోని ఇద్దరు కీలక నేతలపై సోషల్ మీడియాలో జరుగుతున్న నెగిటివ్ ప్రచారంపై పార్టీలో చర్చ మొదలైంది. పార్టీ అధిష్టానంతో సమన్వయ లోపం ఏర్పడిందని, పార్టీ మారుతున్నారని, సొంత పార్టీ పెడుతున్నారని, కేటీఆర్‌తో సయోధ్య లేదని ఇలా రకరకాలుగా గత కొన్ని రోజులుగా మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవితపై సోషల్‌మీడియాలో ప్రచారం ఊపందుకుంది. ఆ క్రమంలో హరీష్ రావుపై జరుగుతున్న ప్రచారానికి సంబంధించి కొంతమంది నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది పరిస్థితి. కవిత విషయంలో మాత్రం సైలెంట్‌గా ఉండిపోవడం చర్చనీయాంశమైంది.

వీరిపై సొంతపార్టీ నేతలు కుట్రలు పన్నుతున్నారా? లేకుంటే ఇతర పార్టీలు కావాలని వారిపై దుష్ప్రాచారం చేస్తున్నారా? అని గులాబీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. గులాబీ పార్టీలో నేతల మధ్య సమన్వయం లేదని, ఎవరికి వారుగా విడిపోయారని ప్రచారం చేస్తే ఎవరికి లాభం?…పార్టీ బలోపేతం కాకుండా అడ్డుకునే కుట్రలో భాగమా?.. లేకుంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిపై జరుగుతున్న దుష్ప్రాచారాన్ని స్వయంగా వారే మీడియా ముందుకు వచ్చి ఖండించాల్సిన రావడంపైన నేతలు చెవులు కొరుక్కుంటున్నారట. అసలు ఇదంతా ఎవరి పని అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిందట కారు పార్టీలో.

హరీశ్ రావు, కవిత విషయంలో జరుగుతున్న పరిణామాలపై పార్టీ అధినేత కేసీఆర్ నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. పార్టీలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? ఎవరు ఏం చేస్తున్నారు? దుష్ప్రచారాన్ని ఎలా ఖండిస్తున్నారు? పార్టీపై ఎలా స్పందిస్తున్నారు? బలోపేతానికి ఎలాంటి చర్యలతో ప్రజల్లోకి వెళ్తున్నారనే వివరాలను సైతం తెలుసుకుంటున్నట్లు సమాచారం. పార్టీకి ఏమైనా డ్యామేజ్ అవుతుందా? తదితర వివరాలను సైతం ఆరా తీస్తున్నట్లు సమాచారం.

అయితే, ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత తన గురించి రకరకాల కథనాలు వస్తూనే ఉంటాయి, అనేక ఆరోపణలు, కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారో అన్నీ తనకు తెలుసన్నారు. సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుతానని, తనను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తానని హెచ్చరించారు. కవిత చేసిన వ్యాఖ్యలు సైతం పార్టీ నేతలు, క్యాడర్‌లో చర్చకు దారితీస్తున్నాయి. ఆమెపై ఎవరు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనేది రాజకీయ వర్గాల్లో రకరకాల అనుమానాలకు దారి తీస్తోంది

మరోవైపు హరీష్ రావు సైతం మీడియా ముందుకు వచ్చి ఆయనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించుకున్నారు. పార్టీ మారుతానని‌.. జరుగుతోన్న చిల్లర ప్రచారాన్ని బంద్ చేయాలని వార్నింగ్ ఇచ్చిన పరిస్ధితి. తమ పార్టీలో ఎలాంటి పంచాయితీ లేదని క్లారిటీ ఇచ్చారు. కేటీఆర్ కు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తానని స్పష్టం చేశారు. మై లీడర్ ఈజ్ కేసీఆర్.. వాటెవర్ కేసీఆర్ సేస్.. హరీష్ రావు విల్ ఫాలోస్.. అని పేర్కొన్నారు. అయితే పార్టీ అధిష్టానం మాత్రం సైలెంట్‌గా ఉండడంతో కేడర్‌లో గందరగోళం కనిపిస్తోంది. ప్రధానప్రతిపక్ష పార్టీగా నేతలంతా సమష్టిగా ఉండాల్సిన సమయంలో ఎవరికి వారుగా మీడియా ముందుకు వచ్చి పార్టీపై క్లారిటీ ఇచ్చుకోవాల్సి రావడం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది