
జూన్ 2… తెలంగాణ రాష్ట్రం అవతరించిన రోజు. 40 ఏళ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం 2014లో తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిన రోజు.. నేటితో పదకొండేళ్లు పూర్తయ్యాయి. ఓవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్సార్ ఆకస్మికంగా మృతి చెందిన నేపథ్యంలో..
మరోవైపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలు సంభవించాయి.
ఈ రెండు పరిణామాలు మాజీ సీఎం కేసీఆర్ కు అనుకూలంగా మారాయి. నాటి తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు తోడ్పడింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించేలా కేంద్రంపై ఒత్తిడి పెంచారు. నిరాహార దీక్ష చేశారు. ప్రజల్ని ఏకం చేసి, తెలంగాణ కార్యసాధకుడయ్యాడు. కేసీఆర్ సృష్టించిన ఈ అలజడి వాతావరణంతో ఇక తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం తప్పిస్తే, మరో మార్గం లేకుండా అయిపోయింది. చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది.
2014 జూన్ 2 న తెలంగాణ రాష్ట్రం, దేశంలో 29వ రాష్ట్రంగా నూతనంగా అవతరించింది. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా జూన్ 2న కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. భారత్లో హైదరాబాద్ ప్రాంతం విలీనం అయినప్పటి నుంచి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వరకు జరిగిన సుదీర్ఘ పోరాటాల్లో కొన్ని ముఖ్య ఘట్టాలు ఇవి:
1948- నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రం (ప్రస్తుత తెలంగాణ) పోలీస్ చర్యతో భారత్లో విలీనమైంది. అప్పట్నుంచి 8ఏళ్ల పాటు హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగింది. 1956- ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలను కలిపి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్చలు జరిపింది.
పెద్దమనుషుల ఒప్పందం (జెంటిల్ మెన్ అగ్రిమెంట్)తో హైదరాబాద్ రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక రక్షణలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఏర్పాటు చేసింది.
1969- పెద్ద మనుషుల ఒప్పందంలోని రక్షణలు అమలవ్వడం లేదని భావించిన తెలంగాణ ప్రజలు తొలిసారిగా ఉద్యమించారు. ఇలా ఉద్యమించిన సమయంలో పోలీసుల కాల్పుల్లో 300 మంది ప్రజలు చనిపోయారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితి అనే పార్టీని స్థాపించారు.
1973- ఇరు ప్రాంతాల మధ్య సయోధ్యను కుదిర్చేందుకు నాటి ప్రధానమంత్రి ఇంధిరా గాంధీ ఆరు సూత్రాల పథకాన్ని (సిక్స్ పాయింట్ ఫార్ములా) ప్రతిపాదించారు. దీనికి ఆంధ్రా, తెలంగాణ ముఖ్య నేతలు అంగీకరించారు. దీంతో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన ఉద్యమాలు ఆగిపోయాయి.
ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని పెట్టారు. 2001- తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆ పార్టీ శాసనసభ్యుడు కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు.
తెలంగాణ సిద్ధాంతకర్త అయిన ప్రొఫెసర్ జయశంకర్ తదితర మేధావులు కేసీఆర్కు సపోర్ట్ గా నిలిచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కేసీఆర్ నిరాహార దీక్ష చేశారు. ఇది అప్పట్లో సంచలనం రేపింది.
2009- ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఆయన దీక్షకు తెలంగాణవాదులు, విద్యార్థులు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. దీంతో తెలంగాణలో ఉద్యమం కాస్త ఊపందుకుంది. అలానే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి శ్రీకాంతచారి ఆత్మబలిదానం చేసుకోవడం మరువలేనిది.
కేసీఆర్ దీక్షతో తెలంగాణలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. తెలంగాణ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటామని డిసెంబర్ 9న కేంద్రం ప్రకటించింది. 2010- తెలంగాణ ఏర్పాటుపై ఆంధ్ర ప్రాంతం నుంచి వ్యతిరేకత రావడంతో తెలంగాణ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది.. అదే జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ.
ఈ కమిటీ రెండు ప్రాంతాలను సందర్శించి తన నివేదికలో ఆరు రకాల ప్రతిపాదనలు చేసింది. 2011, 2012- శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు ఇరుప్రాంతాలను సంతృప్తిపరచలేకపోయింది. *ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) ఏర్పడింది.
వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు కలసి మిలియన్ మార్చ్, సాగర హారం, చలో అసెంబ్లీ, సకల జనుల సమ్మె ద్వారా తమ నిరసనలు తెలుపుతూ ఉద్యమాలు చేశారు. 2013- హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. సీడబ్ల్యూసీ నిర్ణయానికనుగుణంగా తెలంగాణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
2014- అసెంబ్లీలో తెలంగాణ బిల్లు వెళ్లింది.
ఈ బిల్లును వ్యతిరేకిస్తూ అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి శాసనసభ ఆమోదం ఇచ్చింది.
కానీ, వివిధ పార్టీల మద్దతుతో రాజ్యసభ, లోక్సభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొంది..అనంతరం జూన్ 2న ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ అనేది ఆవిర్భవించింది.