గ్రీన్ ఫీల్డ్ వే..!

Greenfield Express Highway: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలను క‌లిపే విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి ఇప్పుడు మరింత ఆధునిక రూపం సంత‌రించుకోనుంది. త్వరలోనే భారీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోబోతోంది. మరి, ఏంటి నయా ఎక్స్ ప్రెస్ వే? ఈ ప్రాజెక్ట్ కు అయ్యే ఖర్చెంత? ఇది అందుబాటులోకి వస్తే తెలుగురాష్ట్రాలకు కలిగే లాభాలేంటి? అనే అంశాలు ఇప్పుడు చూద్దాం..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు జీవనాడి హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారి. అది ఎంత ఆధునిక రూపం సంతరించుకుంటే రెండు రాష్ట్రాల మధ్య అంత దూరం తగ్గుతుంది. సురక్షితమైన, సౌకర్యవంతమైన… వేగవంతమైన ప్రయాణానికి వీలవుతుంది. ఇరుప్రాంత ప్రజలు రెండున్నర, మూడు గంటల్లో గమ్యస్థానానికి చేరుకునే వెసులుబాటు ఉంటుంది. ఉన్న రహదారుల అభివృద్ధి, వరసల పెంపుతో ఆ ఫలితాలు ఇప్పటికే చూస్తున్నాం. వాటికి కొనసాగింపుగా ఇప్పుడో మరో మెగా అనుసంధాన ప్రాజెక్టు రానుంది. అదే హైదరాబాద్-అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే. కేంద్రం కూడా దీని నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ, ఏపీ రాష్ట ప్రభుత్వాల అధికారులు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవేకు D.P.R సిద్ధం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ప్రాజెక్టుపై సుముఖత చూపడంతో కేంద్ర ప్రభుత్వం ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి ఆమోదం తెలిపింది. రోడ్లు, ఉపరితల రవాణా శాఖ ఇప్పటికే సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (DPR) సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ శివారులోని అవుటర్ రింగ్ రోడ్‌ నుంచి ఈ హైవే ప్రారంభమై అమరావతికి చేరేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీరిరి పూర్తిస్థాయి యాక్సెస్ కంట్రోల్డ్ రహదారిగా నిర్మించ‌నున్నారు. అంటే పశువులు, సాధారణ వాహనాలు హైవేపైకి రాకుండా ఉండేందుకు కంచెలు, భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు చేస్తారు.

ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ ఎక్స్‌ప్రెస్‌వే పొడవు 230 నుంచి 250 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ప్రాజెక్ట్ వ్యయం రూ. 8,800 కోట్ల నుంచి రూ. 10 వేల కోట్ల వరకు ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. సర్వీస్ రోడ్లు లేకుండా, నాలుగు వరుసల ఎక్స్‌ప్రెస్ హైవేగా ఇది రూపొందనుంది. ప్రధాన పట్టణాలకు దగ్గరగా మాత్రమే ఎగ్జిట్ రోడ్లు ఏర్పాటవుతాయి. త్వరలోనే DPRకు టెండర్లు పిలవనున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్–విజయవాడ ప్రయాణానికి 5 గంటలకు పైగా సమయం పడుతోంది. రాబోయే గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే వల్ల ఈ ప్రయాణం 70 కి.మీ తగ్గనుంది. ఫలితంగా అమరావతి–హైదరాబాద్ మధ్య ప్రయాణం కేవలం 2 నుంచి 3 గంటల్లో పూర్తవుతుంది. దీంతో ఇంధనం, సమయం రెండూ ఆదా అవుతాయి. ముఖ్యంగా పండగల సమయంలో, రద్దీ సమయంలో ఈ ఎక్స్‌ప్రెస్‌వే ముఖ్య పాత్ర పోషించ‌నుంది.

ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి ఈ హైవే ప్రాముఖ్యతను కేంద్రానికి వివరించడంతో, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ప్రాజెక్ట్ అమలును ప్రకటించారు. ఇది అందుబాటులోకి వస్తే ప్రయాణ సౌకర్యం మాత్రమే కాదు, రెండు రాష్ట్రాల మధ్య ఆర్థిక, సామాజిక బంధాలు మరింత బలపడతాయి.

తెలంగాణకు సముద్రతీరం లేకపోవడం వల్ల దిగుమతి–ఎగుమతులకు ఏపీ పోర్టులపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం చేసే రైలు మార్గం, హైదరాబాద్ శివారులో డ్రైపోర్టు ప్రణాళికలో ఉన్నాయి. కొత్త ఎక్స్‌ప్రెస్‌వే వాణిజ్య రవాణాకు అనువుగా ఉండి, ఎగుమతులు–దిగుమతులు తక్కువ ఖర్చుతో జరగనున్నాయి. అంతేకాకుండా రహదారి వెంబడి పారిశ్రామిక అభివృద్ధికి అవకాశాలు పెరుగుతాయి. చిన్న పట్టణాలు, గ్రామాలు వాణిజ్య కేంద్రాలుగా ఎదిగేందుకు అవ‌కాశాలు ఉంటాయి. Greenfield Express Highway.

ప్రస్తుతం విజయవాడ హైవేలో ఎల్బీనగర్-హయత్‌నగర్ మార్గంలో వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ మార్గంలో ప్రతిరోజూ లక్షలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయన్నారు. దీంతో వాహనాదారులు ట్రాఫిక్ జామ్ పరిస్థితిని ఫేస్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో తరచుగా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి.. ముఖ్యంగా రోడ్డు దాటుతున్న పాదచారులకు, స్థానిక వాహనదారులకు భద్రత కరువైందని.. ఈ సమస్యకు పరిష్కారంగా, కింది భాగంలో వాహనాలు, పైన మెట్రోరైలు వెళ్లేలా డబుల్ డెక్కర్ రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q