కీలక పరిణామం..!!

YS Vivekananda Reddy Case: ఏపీలో ఆరేళ్లుగా సంచలనం రేపుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు తెలంగాణ హైకోర్టు ఈ కేసులో నిందితులకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. దీనిపై నిర్ణయం కంటే ముందు సీబీఐ దర్యాప్తు ఇంకా అవసరమా లేదా అనేది తేల్చేందుకు సుప్రీంకోర్టు ప్రయత్నిస్తోంది. దీంతో సీబీఐ ఇరుకునపడింది.

వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరేళ్లుగా దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. దోషుల్ని మాత్రం తేల్చలేకపోయింది. అదే సమయంలో తెలంగాణ హైకోర్టు ఈ కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి సహా ఇతరులకు బెయిల్ ఇచ్చింది. దీంతో ఈ బెయిల్ రద్దు చేయాలంటూ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సుప్రీంకోర్టు సీబీఐ అభిప్రాయం కోరింది. ఈ నేపథ్యంలో వివేకా కేసులో దర్యాప్తు ముగిసిందని, కోర్టు కోరితే మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తామని సీబీఐ తెలిపింది. దీంతో అసలు వివేకా కేసులో మరింత దర్యాప్తు అవసరమా కాదా చెప్పాలని సీబీఐని సుప్రీం ఆదేశించింది.

ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి వివేకా కేసు విచారణ సుప్రీంకోర్టులో జస్టిస్ సుందరేశ్ బెంచ్ ముందుకు వచ్చింది. అయితే సీబీఐ తరఫున హాజరైన అడ్వకేట్ జనరల్ ఎస్వీ రాజు ఈ కేసులో మరింత దర్యాప్తు అవసరమా కాదా అనేది చెప్పేందుకు సమయం కోరారు. ఇప్పటికే ఈ కేసులో నిందితులకు కేంద్రం అండదండలు ఉండటంతో సీబీఐ ముందుకెళ్లలేకపోతోందన్న ఆరోపణల నేపథ్యంలో తదుపరి దర్యాప్తుపై తేల్చేందుకు మరింత సమయం కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది. YS Vivekananda Reddy Case.

వివేకా కేసులో మరింత లోతైన దర్యాప్తు అవసరంపై తన అభిప్రాయం చెప్పేందుకు సీబీఐ సమయం కోరడంతో సుప్రీంకోర్టు కూడా చేసేది లేక మరో వారం పాటు విచారణను వాయిదా వేసింది. ఈ నెల 16న మధ్యాహ్నం 2 గంటలకు ఈ కేసు విచారణ చేస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది. ఈ విచారణలో సీబీఐ చెప్పే సమాధానం ఇప్పుడు వివేకా కేసులో తదుపరి దర్యాప్తుకు కీలకంగా మారింది. దీన్ని బట్టే అవినాష్ రెడ్డి సహా ఇతర నిందితుల బెయిల్ రద్దు కూడా ఆధారపడి ఉంది.