‘విశాల్ 35’ ప్రాజెక్ట్‌లోకి తెలుగు హీరోయిన్ అంజలి ఎంట్రీ

Anjali అంజలి ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా పాత్రలను ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విశాల్ 35వ ప్రాజెక్ట్‌లోకి అంజలి వచ్చేశారు. వరుస సక్సెస్‌లతో ఉన్న విశాల్ ఇప్పుడు తన కెరీర్‌లో 35వ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించారు. చివరగా ‘మద గద రాజా’ అంటూ అంజలి, వరలక్ష్మీ శరత్ కుమార్‌లతో విశాల్ చేసిన సందడికి కాసుల వర్షం కురిసింది. మళ్లీ ఇప్పుడు విశాల్, అంజలి కాంబోలో సినిమా రాబోతోంది. విశాల్ 35 ప్రాజెక్ట్‌ని ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి ప్రతిష్టాత్మక బ్యానర్ సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది.

తాజాగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీలో అంజలి కీలక పాత్రను పోషించబోతోన్నారు. ఈ మేరకు విశాల్ 35 ప్రాజెక్ట్‌లోకి అంజలి వచ్చేశారన్నట్టుగా టీం ప్రకటించింది. ఈ మూవీకి ఎన్.బి. శ్రీకాంత్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. దురైరాజ్ కళా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. మార్క్ ఆంటోనీ విజయం తర్వాత జి.వి. ప్రకాష్ కుమార్ మరోసారి ఈ చిత్రానికి విశాల్‌తో కలిసి పనిచేస్తున్నారు. నటి దుషార విజయన్ విశాల్ సరసన కథానాయికగా నటించనున్నారు.

ఈ కొత్త చిత్రానికి రవి అరసు దర్శకత్వం వహించనున్నారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం. నాథన్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. నటుడు విశాల్, దర్శకుడు రవి అరసు కాంబోలో ఇది మొదటి చిత్రం. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు చెన్నైలో అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సినిమాకు సంబంధించిన ఇతర వివరాల్ని త్వరలోనే ప్రకటించనున్నారు. Anjali