
Upcoming patriotic Movies: దేశం కోసం అమరులైన వీరులు ఎందరో ఉన్నారు. అందరి కథలు వెండితెరపైకి రాక పోవచ్చు. అయితే దేశభక్తిని చాటి చెప్పే, దేశభక్తి స్ఫూర్తిని నింపే సినిమాలు ఎప్పటికప్పుడు వెండితెరపైకి వస్తూనే ఉంటాయి… ప్రేక్షకుల్లో దేశభక్తి స్ఫూర్తిని పెంపొందిస్తున్నాయి. కొందరు ‘రియల్ హీరోస్’ గాథలను గుర్తు చేస్తూనే ఉన్నాయి. అలా ప్రస్తుతం దేశభక్తిని చాటే కొన్ని సినిమాలు సెట్స్పై ఉన్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న కొన్ని సినిమాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం…
‘సీతారామం’ సినిమాలో దేశభక్తి, ప్రేమ అంశాలను మిళితం చేసి, వెండితెరపై ప్రేక్షకులకు నచ్చేలా చూపించారు దర్శకుడు హను రాఘవపూడి. ఈ దర్శకుడు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్). భారతదేశ స్వాతంత్య్రానికి పూర్వం 1940 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఈ చిత్రంలో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఆదిపత్యం కోసమే యుద్ధాలు జరిగే ఆ రోజుల్లో యుద్ధానికి కొత్త నిర్వచనం చెప్పే ఓ యోధుడి పాత్రగా ప్రభాస్ క్యారెక్టరైజేషన్ ఉంటుందని తెలుస్తోంది. అలాగే స్వాతంత్య్ర సమర యోధుడు సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హిందూ ఫౌజ్, రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యాలు కూడా ఈ చిత్రంలో ఉంటాయని టాక్..
అడివి శేష్ హీరోగా నటిస్తున్న స్పై డ్రామా ‘గూఢచారి 2’ కూడా దేశభక్తి నేపథ్యంతో తెరకెక్కుతోంది. అడివి శేష్ హీరోగా 2018లో విడుదలై, సూపర్హిట్గా నిలిచిన ‘గూఢచారి’కి ఇది సీక్వెల్. వినయ్ కుమార్ ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. ఇందులో అడివి శేష్, వామిక ప్రధాన స్పై పాత్రల్లో నటిస్తున్నారు. అనిల్ సుంకర, టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మే 1న విడుదల కానుంది.
దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న మరో చిత్రం ‘ది ఇండియా హౌస్’. భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు 1905లో లండన్లో ఉన్న కొందరు భారత మేథావులు ఎలా సమావేశం అయ్యారు? భారతదేశానికి స్వాతంత్య్రం రావాలనే కార్యాచరణకు ఎలాంటి వ్యూహాలు రచించారు? అనే అంశాల నేపథ్యంలో ‘ది ఇండియా హౌస్’ రూపొందుతోందని సమాచారం. అలాగే వీర్ సవార్కర్ జీవితంలోని కొన్ని సంఘటనలు ఈ సినిమాలో కనిపిస్తాయి. నిఖిల్ హీరోగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్గా అనుపమ్ ఖేర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. రామ్చరణ్ సమర్పణలో వి మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
సల్మాన్ ఖాన్ హీరోగా 2020లో గాల్వాన్ లోయలో ఇండియా–చైనా సైనికుల మధ్య జరిగిన ఉద్రిక్త ఘర్షణల నేపథ్యంలో ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో సల్లూ భాయ్ దేశభక్తిని చాటి చెప్పే ఆర్మీ ఆఫీసర్గా కనిపించనున్నారు. ఇందుకోసం ఈ హీరో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఈ చిత్రంలో చిత్రాంగదా సింగ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా సినిమాను విడుదల కానుంది. Upcoming patriotic Movies.
భారతీయ సైనికుల వీరత్వం, వీరోచితపోరాటం నేపథ్యంలో రూపొందుతున్న తాజా హిందీ చిత్రం ‘బోర్డర్ 2’. ఈ సినిమాలో సన్నీ డియోల్ లీడ్ రోల్ చేయగా, వరుణ్ ధావన్, అహన్ శెట్టి, దిల్జీత్ సింగ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సన్నీ డియోల్, వరుణ్ ధావన్, అహాన్ శెట్టి భారత సైనికుల పాత్రల్లో నటించారు. ఈ వార్ డ్రామా వచ్చే ఏడాది జనవరి 23న విడుదల కానుంది. ఇక 1971లో ఇండియా – పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో రూపొందిన ‘బోర్డర్’ సినిమాకు సీక్వెల్గా ‘బోర్డర్ 2’ చిత్రం తెరకెక్కుతోంది.