
Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక క్యాండిడెట్ ఎంపిక విషయంలో బీజేపీ వ్యూహం ఏంటి.. మహిళా అభ్యర్ధిని రంగంలోకి దింపాలని ఆలోచిస్తున్నారా… లేక పాత ముఖ చిత్రాన్నే మళ్ళీ తెర మీదకు తెస్తారా?..అనేది పార్టీలో హాట్ టాపిగా మారింది. ఉప ఎన్నికల్లో సత్తా చాటుకొని రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బిజెపినే అన్న సంకేతాలు ప్రజల్లోకి బలంగా పంపాలన్న పట్టుదలతో బీజీపి ఉన్నట్లు తెలుస్తుంది. ఈసారి బీఆర్ఎస్ సిట్టింగ్ సీటుని ఏలాగైనా కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది?.. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ గెలవాలన్న స్కెచ్ వర్కౌట్ అవుతుందా?
జూబ్లీహిల్స్ ఉపఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నిక ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు కీలకం కానుంది. గతంలో జరిగిన తప్పిదాలను దృష్టిలో పెట్టుకొని…వచ్చే ఉప ఎన్నికలో గెలుపు కోసం పక్కా స్కెచ్ లు వేస్తున్నాయి. పదేళ్ల కేసీఆర్ పాలనకు గుడ్ బై చెప్పిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. అంతేకాదు కాంగ్రెస్ ప్రజా పాలన వచ్చి ఏడాదిన్నర తర్వాత జరిగే ఉప ఎన్నిక ఇది. మరి ముఖ్యంగా ప్రజా పాలనని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి జుబ్లీ హిల్స్ బైపోల్ మరింత కీలకం కానుంది.
సార్వత్రిక ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ ఖాతా కూడా లేదు. తర్వాత జరిగిన కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును గెలుచుకుని షాక్ ఇచ్చింది. ఇప్పుడు కచ్చితంగా జూబ్లీహిల్స్ సీటు గెలిచి హైదరాబాద్పై పట్టు పెంచుకోవాలని కాంగ్రెస్ పక్కా ప్లాన్ తో ఉంది. ఈ ఎన్నికలో గెలుపు రాబోయే గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలకు బూస్టప్గా నిలుస్తాయన్న అంచనాల్లో అన్ని పార్టీలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు ముందు జరిగే ఈ ఉప ఎన్నిక దిశ దశలను మార్చే ఎన్నికగా భావిస్తూ అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా స్కెచ్ లు వేస్తున్నాయి. మరోవైపు సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునే ప్లాన్ బీఆర్ఎస్ ఉంది.
ఇక ఈ సారి జూబ్లీహిల్స్ స్థానంపై పట్టుబిగించాలని కమలనాథులు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించి మంచి జోష్ మీదున్న బీజేపీ అదే జోష్లో జూబ్లిహిల్స్ పై కాషాయ జెండా ఎగరవేయాలనే సంకల్పంతో అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే కాషాయ నేతలు జూబ్లిహిల్స్ స్థానంపై గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో జూబ్లిహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. సికింద్రాబాద్ ఎంపీగా కొనసాగుతున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఈ ఉప ఎన్నిక సవాల్ గా మారనుంది.
అయితే పార్టీలో టికెట్ ఎవరికి అనే దానిపై పార్టీలో ఓవైపు చర్చ.. మరోవైపు రచ్చ జరుగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి లంకల దీపక్ రెడ్డికి పార్టీ ఛాన్స్ ఇచ్చింది. కానీ ఫలితం రాబట్టలేకపోయింది. కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుండటం వల్లే దీపక్ రెడ్డికి గత ఎన్నికల్లో అవకాశం వచ్చిందనే టాక్ ఉంది. గత ఎన్నికల్లో ఘోరపరాజయం పాలైన దీపక్ రెడ్డిపై ఈ ఉప ఎన్నికల్లో సానుభూతి కలిసొస్తుందనే చర్చ దీపక్ వర్గీయుల్లో ఉన్నట్టు టాక్ వినిపిస్తుంది. కానీ అందుకు భిన్నంగా ఈ సారి అధిష్టాన పెద్దలు మాత్రం దీపక్ రెడ్డికి మళ్ళీ టికెట్ ఇచ్చి, ఆ తప్పు, ఆ సాహసం చేయరనీ, ఆ పరాజయాన్ని మళ్ళీ చవిచూడడానికి సిద్దంగా లేరంటున్నారు.
అయితే అధిష్టాన లెక్కల ప్రకారం దీపక్ రెడ్డిని పక్కన పెట్టి, ఈ సారి జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో మహిళలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ఆలోచనలో అధిష్టానం ఉదంటున్నారు. అంతేకాదు బీజేపీ నూతన అధ్యక్షుడు, రాష్ట్ర బీజేపీ కార్యవర్గం ఎన్నిక తర్వాత బీజేపీలో మహిళా ప్రాతినిథ్యం పూర్తిగా తగ్గిందనే విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం పార్టీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 21 మంది ఉన్నారు. వీరిలో డీకే అరుణ మినహాయిస్తే, మహిళా ప్రాతినిథ్యమే లేదు. ఆ లెక్కలతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మహిళలకు ఛాన్స్ ఇచ్చేందుకు నాయకత్వం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
మహిళా శక్తితోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై తొలి విజయం సాధించి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపేననే భవిష్యత్ సంకేతాలు ప్రజల్లోకి పంపించాలనే ఉద్దేశంతో పార్టీ పెద్దలున్నట్టు సమాచారం. ఒకవేళ కిషన్రెడ్డి పట్టుబట్టి దీపక్ రెడ్డికే టికెట్ ఇప్పించుకుంటే కచ్చితంగా ఆది బీఆర్ఎస్ కు ఉపయోగపడే అవకాశముందనే ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ ముఖ్య నేతలు సైతం అదే ఫీల్ అవుతున్నారు. గతంలో కూడా ఒక డమ్మీ అభ్యర్థిని బరిలో దించి బీఆర్ఎస్ కు సహకరించారనే అపవాదు బీజేపీపై ఉంది. Jubilee Hills by-election.
జూబ్లిహిల్స్ టికెట్పై చాలామంది బీజేపీ నాయకులు పెద్ద ఆశలే పెట్టుకున్నట్లు తెలుస్తుంది. అయితే మహిళా అభ్యర్ధితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో దిగితే పక్కాగా కాంగ్రెస్, బీఆర్ఎస్ లను ఎదురుకోవచ్చనే అంచనాల్లో బీజేపీ నాయకత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీజెపీ అధిష్టాన పెద్దల ఆశీస్సులు ఎవరికి దక్కుతాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహిళ ప్రాతినిథ్యం కోణంలో పార్టీ ఆలోచిస్తే గనక ఈ స్థానం నుంచి జూటూరి కీర్తి రెడ్డి ముందు వరసలో ఉన్నారనే టాక్ నడస్తోంది. వీరపనేని పద్మ కూడా ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా జూటూరీ కీర్తి రెడ్డి టికెట్ కోసం చాలానే ప్రయత్నాలు చేశారు. ఈ సారి బైపోల్లో పోటీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి జూబ్లీ హిల్స్ అభ్యర్ధి ఎంపిక విషయంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది బీజేపీ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోంది . ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.