
Deputy CM Pawan Kalyan: ఉప్పాడ ప్రాంత మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలు మొదలుపెట్టారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఉన్నతాధికారులు, మత్స్యకార ప్రతినిధులు, స్థానిక నాయకులతో ఓ కమిటీ వేశారు. అత్యవసరంగా పరిష్కరించాల్సిన సమస్యల్ని గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం ఓ ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం మత్స్యకారులతో కూర్చొని అన్ని సమస్యలపై చర్చిస్తానని మాటిచ్చారు.
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉప్పాడలో మత్స్యకార కుటుంబాలు ఆందోళన బాటపట్టాయి. కోనపాపపేట, మూలపేట, అమీనాబాద్ మత్స్యకార గ్రామాల్లో రహదారులు మూసివేసి తమ నిరసన తెలపారు. ఫార్మా కంపెనీలు, పరిశ్రమలు విడుదల చేసే కాలుష్యం కారణంగా సముద్ర జలాలు కలుషితమై మత్స్య సంపద లభించక జీవనోపాధికి ఇబ్బందులు పడుతున్నామని.. మా ఆకలి కేకలు వినండని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీరప్రాంతంలో నిర్మించిన పరిశ్రమలను తక్షణం మూసివేయాలని మత్స్యకారుల ప్రధాన డిమాండ్. అంతే కాదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చే వరకు రాస్తారోకో కొనసాగిస్తామన్నారు.ఈ నేపథ్యంలో ఉప్పాడ ప్రాంత మత్స్యకారుల ఆందోళనలు, వారి సమస్యలు తన దృష్టిలో ఉన్నాయని స్పందించారు డిప్యూటీ సీఎం. ఈ మేరకు ఓ లేఖను కూడా విడుదల చేశారు.
మత్స్యకార కుటుంబాలు ఎదుర్కొంటున్న కష్టాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోగలనన్నారు డిప్యూటీ సీఎం . శాసనసభ సమావేశాల కారణంగా వ్యక్తిగతంగా వచ్చి మత్స్యకారులతో నేరుగా చర్చించలేకపోతున్నానని తెలిపారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో నిరంతరం చర్చిస్తున్నానని చెప్పారు. మత్స్యకారులు ప్రస్తావిస్తున్న ప్రతి సమస్యను పరిగణనలోకి తీసుకొని పరిష్కార మార్గాలు అన్వేషించాలని కమిటీని ఆదేశించానన్నారు. కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమలు, ఫిషరీష్, రెవెన్యూ ఉన్నతాధికారులు, కాకినాడ జిల్లా కలెక్టర్ తో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు పవన్ కళ్యాణ్. ఇందులో మత్స్యకార ప్రతినిధులు, స్థానిక నాయకులకు స్థానం ఇవ్వాలని నిర్ణయించారు. సమస్యల పరిష్కారంతో పాటు జీవనోపాధుల మెరుగుదల, తీర ప్రాంత గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపైనా ఈ కమిటీ దృష్టిపెడుతుంది. నష్ట పరిహారం మదింపు గురించి ఈ కమిటీ చర్చిస్తుంది. ఈ కమిటీ మత్స్యకారుల సమస్యలను అధ్యయనం చేసి, అమలు చేయదగిన సిఫారసులతో కూడిన నివేదికను సిద్ధం చేస్తుంది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు పవన్. Deputy CM Pawan Kalyan.
ఇప్పటికే వీలైనంత త్వరగా పరిష్కరించాల్సిన సమస్యలను ఇదివరకే గుర్తించామన్నారు పవన్. మరణించిన 18 మంది మత్స్యకారులకి సంబంధించి వారి కుటుంబాలకు చెల్లించాల్సిన బీమా మొత్తం చెల్లింపుపై అధికారులతో చర్చించామన్నారు. ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ దగ్గర దెబ్బ తిన్న పడవలకు నష్ట పరిహారం చెల్లింపు అంశాలపై అధికారులతో చర్చించి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించానని చెప్పారు. అలాగే మచిలీపట్నం, అంతర్వేది తదితర ప్రాంతాల్లో మత్స్యకారులకు వేటకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వడంపైనా దృష్టి సారించాలని స్పష్టం చేశానన్నారు. ఈ అంశాలపై కమిటీ నివేదిక కోసం ఎదురుచూడకుండా ప్రాధాన్యత ఇచ్చి సమస్యలను పరిష్కరించాలని తెలిపానని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత, స్వయంగా తానే వచ్చి ఉప్పాడ మత్స్యకారులతో కూర్చొని అన్ని సమస్యలపై సమగ్రంగా చర్చిస్తానని మత్స్యకారులకు మాటిచ్చారు డిప్యూటీ సీఎం.