
US Army in Bangladesh: బంగ్లాదేశ్లో అమెరికా సైనిక కార్యకలాపాలు ఊపందుకున్నాయి. 120 మంది అమెరికా సైనికులు సంయుక్త విన్యాసాల కోసం రహస్యంగా బంగ్లాదేశ్కు చేరుకున్నారు. అయితే వారి రాక గోప్యంగా ఉంచడం అనేక అనుమానాలకు తావిస్తోంది. సరిగ్గా వారం రోజుల క్రితం.. బంగ్లాదేశ్లో యూఎస్ ఆర్మీ దిగింది. అమెరికాతో కలిసి.. బంగ్లాదేశ్లోని యూనస్ ప్రభుత్వం ఏం ప్లాన్ చేస్తోంది? అసలు.. బంగ్లాదేశ్లో.. యూఎస్ ఆర్మీ చేపట్టిన సీక్రెట్ మిషన్ ఏంటి? వారి టార్గెట్ ఏంటి? రిపోర్టులు ఏం చెబుతున్నాయ్?
బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా పదవీచ్యులైన తర్వాత.. ఆ దేశంతో అమెరికా సైనిక సంబంధాలు గణనీయంగా పెరిగాయి. దీనిలో భాగంగానే అమెరికా సైన్యం, వైమానిక దళానికి చెందిన సుమారు 120 మంది అధికారులు సంయుక్త సైనిక విన్యాసాల కోసం బంగ్లాదేశ్లో అడుగు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ 10వ తేదీన యూఎస్-బంగ్లాదేశ్ ఎయిర్లైన్స్ విమానంలో ఢాకా నుంచి చిట్టగాంగ్కు చేరుకున్న ఈ బృందం అక్కడి రాడిసన్ బ్లూ హోటల్లో బస చేసిట్లు తెలుస్తోంది. అయితే వారి రాక గోప్యంగా ఉంచడం అనేక అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు ఈ పర్యటనకు కొన్ని రోజుల ముందే ఓ అమెరికన్ స్పెషల్ ఫోర్సెస్ అధికారి ఢాకాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అయితే ఈయన మృతికి సంబంధించిన కేసు గురించే ఇంత మంది సైనికులు వెళ్లారా లేక మరేదైనా విశేషం ఉందా అని అందరిలోనూ అనుమానాలు మొదలు అయ్యాయి. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా పతనం తర్వాత.. బంగ్లాదేశ్, అమెరికా మధ్య సైనిక సంబంధాలు పెరిగాయి. ఎంతలా అంటే.. బంగ్లాదేశ్ సైన్యంతో.. యూఎస్ ఆర్మీ, యూఎస్ ఎయిర్ఫోర్స్ ఏకంగా జాయింట్ మిలటరీ విన్యాసాలు నిర్వహించే దాకా వచ్చాయ్ పరిస్థితులు.
ఈ పర్యటనకు సంబంధించి ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి. అమెరికా సైనిక సిబ్బంది కోసం హోటల్లో 85 గదులు బుక్ చేసినప్పటికీ.. వారి పేర్లు అతిథుల రిజిస్టర్లో నమోదు కాలేదని సమాచారం. ఈ బృందం సెప్టెంబర్ 20వ తేదీన చిట్టగాంగ్ నుంచి బయలుదేరనుంది. ఈ పర్యటనకు కొన్ని రోజుల ముందు.. ఆగస్టు 31వ తేదీన ఢాకాలోని వెస్టిన్ హోటల్లో టెర్రెన్స్ ఆర్వెల్ జాక్సన్ అనే 50 ఏళ్ల అమెరికన్ స్పెషల్ ఫోర్సెస్ అధికారి మృతదేహం అనుమానాస్పద రీతిలో లభ్యమైంది. అతడు ఏప్రిల్లోనే బంగ్లాదేశ్కు వచ్చినట్లు ఢాకా పోలీసులు గుర్తించారు. ఈ మరణంపై అమెరికా లేదా బంగ్లాదేశ్ ప్రభుత్వాలు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.. కానీ దాని చుట్టూ ఉన్న రహస్యం అనేక అనుమానాలకు తావిస్తోంది.
బంగ్లాదేశ్లో అమెరికా సైనిక బలగాల ఉనికి గురించి పరిశీలిస్తే.. సెప్టెంబర్ 14వ తేదీన ఈజిప్షియన్ వైమానిక దళానికి చెందిన ఒక రవాణా విమానం చిట్టగాంగ్లోని షాహ్ అమానత్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఆ నెక్టస్ డేనే అమెరికా దళాలు బంగ్లాదేశ్ వైమానిక దళం.. పటెంగా ఎయిర్ బేస్ను సందర్శించాయి. అంతకుముందు కూడా అమెరికా దళాలు బంగ్లాదేశ్ సైన్యంతో కలిసి టైగర్ లైట్నింగ్, ఆపరేషన్ లైట్నింగ్ అనే రెండు సంయుక్త విన్యాసాల్లో పాల్గొన్నాయి. ఈ విన్యాసాల ప్రధాన ఉద్దేశ్యం.. శాంతి పరిరక్షణ సంసిద్ధతను పెంపొందించడం, రెండు దేశాల సాయుధ దళాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం.
గతేడాది ఆగస్టులో మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వంపై జరిగిన హింసాత్మక నిరసనల తర్వాత ఆమె అధికారాన్ని కోల్పోయారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అమెరికా, వాషింగ్టన్లతో సైనిక, వ్యూహాత్మక సంబంధాలను మరింత ముమ్మరం చేసింది. షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత బంగ్లాదేశ్తో అమెరికా సంబంధాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఈ పరిణామాలు అంతర్జాతీయంగా భారత ఉపఖండంలో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. బంగ్లాదేశ్, అమెరికా మధ్య పెరుగుతున్న సైనిక సహకారం ఈ ప్రాంత భద్రతా సమతుల్యతను ప్రభావితం చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా భారత్కు ఏమైనా ముప్పు పెరిగే అవకాశం ఉందా అని ఆలోచిస్తున్నారు. US Army in Bangladesh.
యూనస్ ప్రభుత్వం పశ్చిమ దేశాలకు మరింత దగ్గరవుతున్న తరుణంలో.. ఈ పర్యటనలు, విన్యాసాలు కేవలం సాధారణ సైనిక శిక్షణ కోసం మాత్రమేనా లేదా దీని వెనుక మరేదైనా వ్యూహాత్మక ఉద్దేశ్యం ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బంగ్లాదేశ్ తన భౌగోళిక రాజకీయ ప్రాధాన్యతను పెంచుకునే క్రమంలో అమెరికా సహకారాన్ని కోరుకుంటోందని.. దీని ద్వారా ఈ ప్రాంతంలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని చూస్తోందని కొందరు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మొత్తం మీద బంగ్లాదేశ్ రాజకీయ మార్పు తర్వాత ఈ ప్రాంత భద్రతా సమీకరణాల్లో అమెరికా కీలక పాత్ర పోషించబోతోందని చెప్పడానికి ఈ పరిణామాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.