ఇస్లామిక్ సమ్మిట్..!

Qatar Arab Islamic Summit: ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయెల్ దాడి జరిగింది. దీంతో ఇక ఇదే సమయంలో ఖతార్ రాజధాని దోహాలో అరబ్ ఇస్లామిక్ సమ్మిట్ జరుగుతోంది. ఇందులో 50 కి పైగా ముస్లిం దేశాలు పాల్గొన్నారు. ఇజ్రాయెల్ దాడి తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో ముస్లిం దేశాలు కలిసి సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారి. ఈ సమావేశం ఇజ్రాయెల్‌ను మాత్రమే కాకుండా, అమెరికాను కూడా కలవరపెడుతుంది. ఆ విషయాల ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…

గాజాలో ఇజ్రాయెల్ చేసిన దానితో ముస్లిం దేశాలు ఇప్పటికే గుర్రు మీద ఉన్నాయి. కానీ ఖతార్‌లో దాడి తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దానికి తోడు ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్‌ను ఇజ్రాయెల్ మందలించిన తీరుపై కూడా ముస్లిం దేశాలకు కోపం తెప్పించినట్లు సమాచారం. ఖతార్‌పై ఇజ్రాయెల్ దాడితో అమెరికాకు మద్దతు ఇచ్చే గల్ఫ్, అరబ్ దేశాలు కూడా ఐక్యంగా ఉండాల్సి వచ్చిందని సమాచారం. ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలలో మరింత ఉద్రిక్తతను పెంచింది. ఈ అత్యవసర శిఖరాగ్ర సమావేశం అరబ్ లీగ్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) సభ్యులను ఒకచోట చేర్చుతోంది.

ఈ సమావేశంలో ముసాయిదా తీర్మానం చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశం ఖతార్ ఒంటరిగా లేదని సందేశం ఇస్తుందని అరబ్ లీగ్ సెక్రటరీ జనరల్ అహ్మద్ అబుల్ ఘైత్ అషార్క్ అల్-అవ్సత్ క్లారిటీ ఇచ్చారు. ఇక అరబ్, ఇస్లామిక్ దేశాలు దోహాతో ఉన్నాయని ప్రపంచానికి తెలియజేయనున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 9 దాడిపై ముస్లిం దేశాలు ఇజ్రాయెల్‌ను చుట్టుముట్టినప్పుడు కూడా… ఆ దేశ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు వెనక్కి తగ్గలేదు. శత్రువు ఎక్కడ దాక్కున్నా వారిపై దాడి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఖతార్ ప్రభుత్వానికి ఆయన హెచ్చరికలు జారీ చేశారు. హమాస్ నాయకులను వారి దేశం నుంచి బయటకు తీసుకురావాలని లేదా వారిని న్యాయంగా తమ ముందు నిలబెట్టాలని ఆయన స్పష్టం చేశారు. ఖతార్ అలా చేయకపోతే తామే వారిని శిక్షిస్తామని ఆయన పేర్కొన్నారు. దాదాపు రెండు ఏళ్లుగా జరుగుతున్న గాజా యుద్ధాన్ని ఖతార్ ఒక పక్క ముగించడానికి ప్రయత్నిస్తుండగా, ఇజ్రాయెల్ శాంతి అవకాశాలను నాశనం చేస్తోందని దోహా ఆరోపించింది.

ప్రముఖ అరబ్ దేశమైన యుఎఇ కూడా దోహాపై ఇజ్రాయెల్ దాడిపై కోపంగా ఉన్నట్లు సమాచారం. ఈ అంశంపై ఇజ్రాయెల్ డిప్యూటీ రాయబారిని పిలిపించి మందలించింది. ఖతార్ స్థిరత్వం సౌదీ అరేబియాతో సహా గల్ఫ్ సహకార మండలి (జిసిసి)లోని అన్ని సభ్య దేశాల భద్రత, స్థిరత్వంలో అంతర్భాగమని యుఎఇ స్పష్టం చేసింది.

ఇక మరోవైపు ఇజ్రాయెల్ దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ దాడి ఇజ్రాయెల్, అమెరికా లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లలేదని ఆయన అన్నారు. ఖతార్‌ శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్న మిత్రదేశంగా ట్రంప్ పేర్కొన్నారు. అలాగే హమాస్‌ను నిర్మూలించడం ప్రశంసనీయమైనదని అన్నారు. ఖతార్‌లో నివసిస్తున్న హమాస్ నాయకులను తొలగించడంతో గాజాలో ఇప్పటికీ ఖైదు చేసిన బందీలను విడుదల చేయడానికి ఉన్న ప్రధాన అడ్డంకి తొలగిపోతుందని నెతన్యాహు చెప్పారు. అలాగే 2023 అక్టోబర్ 7న హమాస్ దాడులతో ప్రారంభమైన యుద్ధాన్ని ముగించడానికి కూడా మార్గం సుగమం అవుతుందని ఆయన పేర్కొన్నారు.

మధ్యప్రాచ్యంలో అత్యంత సున్నితమైన రాజకీయ పరిస్థితుల మధ్య.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్‌కు స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. హమాస్‌ నాయకులను లక్ష్యంగా చేసుకుని అమెరికా కీలక మిత్ర దేశమైన ఖతార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఇటీవలే ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపిన విషయం అందరికీ తెలుసు. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. దీనిపై స్పందించిన ట్రంప్ షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా ఇలాంటి చర్యల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ట్రంప్ సూచించారు. ముఖ్యంగా ఈ దాడులు లక్ష్యాలను ఛేదించడంలో విఫలం అయ్యాయని.. కానీ ఆరుగురి ప్రాణాలను మాత్రం తీశాయంటూ వ్యాఖ్యానించారు.

ఈ సమయంలోనే ఆయనకు మీడియా ప్రతినిధులు ఓ ప్రశ్న అడిగారు. ముఖ్యంగా ఈ దాడుల గురించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. దీనికి ట్రంప్ సమాధానం చెబుతూ.. వారు చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. హమాస్ విషయంలో ఏదైనా చర్య తీసుకోవాల్సి ఉంటుందని, కానీ ఖతార్ అమెరికాకు గొప్ప మిత్ర దేశం అని పేర్కొన్నారు. ఈ విషయం చాలా మందికి తెలియదని చెప్పారు. Qatar Arab Islamic Summit.

ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడానికి కొన్ని రోజుల ముందు ఆయన న్యూయార్క్‌లో ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ బిన్ జస్సిమ్ అల్ థానీతో విందులో పాల్గొన్నారు. అప్పుడే ఖతార్ ప్రధానిని గొప్ప వ్యక్తిగా అభివర్ణించిన ట్రంప్.. ఆయనకు దేశ ప్రతిష్టను మెరుగుపరచుకోవాలని సలహా ఇచ్చానట్లు చెప్పారు. ప్రజలు ఖతార్ గురించి చాలా చెడుగా మాట్లాడుతున్నారని.. కానీ అలా ఉండకూడదని పేర్కొన్నారు. న్యూయార్క్‌లో సెప్టెంబర్ 11 దాడుల జ్ఞాపకార్థం జరిగిన ఈ విందులో మధ్య ప్రాచ్య ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ కూడా పాల్గొన్నారు. విందు తరువాత ఖతార్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ హమాహ్ అల్-ముఫ్తా ఎక్స్ వేదికగా.. అధ్యక్షుడితో గొప్ప విందు అని అన్నారు. అదిప్పుడే ముగిసిందని చెప్పుకొచ్చారు