అయ్యో పాపం.!

Odisha Fevikwik Incident: సాధారణంగానే పిల్లలు ఆకతాయి పనులు చేయడం, సరదా కోసం పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం మనం చాలా సార్లే చూస్తుంటాం. అయితే తల్లిదండ్రుల పెట్టే భయం వల్లో, బడిలోని ఉపాధ్యాయులు కొడతారనో కాస్త తగ్గి ఉంటారు. ప్రాణాపాయ స్థితికి వచ్చి ఎలాంటి పనులు చేయరు. కానీ హాస్టల్లోనే ఉంటున్న ఓ బాలుడు మాత్రం.. నిద్రలో ఉన్న తన 8 మంది స్నేహితుల కళ్లపై ఫెవిక్విక్ పోశాడు. ఫలితంగా వారంతా ఉదయం నిద్ర లేచిన తర్వాత కళ్లు తెరవలేకపోయారు. ఈ ఘటన ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో జరిగింది.

ఒడిశాలోని కంధమాల్ జిల్లా సలగూడ సేవాశ్రమం హాస్టల్‌లో విద్యార్థులు రాత్రి తమ గదులలో నిద్రపోయారు. అదే హాస్టల్‌కు చెందిన ఒక విద్యార్థి.. తోటి విద్యార్థులు నిద్రిస్తున్న సమయంలో వారిని సరదాగా ఆటపట్టించాలనుకున్నాడో, లేదా ఏదైనా దురుద్దేశంతోనే చేశాడో తెలియదగానీ మొత్తంగా 8 మంది విద్యార్థుల కళ్లలో ఫెవిక్విక్ గమ్ పోశాడు. దీంతో మరుసటి రోజు ఉదయం ఆ ఎనిమిది మంది విద్యార్థులు ఎంత ప్రయత్నించినా తమ కళ్లను తెరవలేకపోయారు. ఈ విషయం తెలుసుకున్న హాస్టల్ సిబ్బంది వెంటనే వారిని లేపి కళ్లను తెరిపించేందుకు ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో పరిస్థితిని గ్రహించి.. వారిని వెంటనే సమీపంలోని గోఛపడ ఆస్పత్రికి తరలించారు.

గోఛపడ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత ఒక విద్యార్థి కళ్లు తెరిచాడు. కానీ మిగిలిన ఏడుగురు విద్యార్థుల పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల కనిపించకపోవడంతో.. వారిని మెరుగైన చికిత్స కోసం పుల్‌బనీలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన గ్రామంలో, పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులలో తీవ్ర ఆందోళనను, ఆగ్రహాన్ని కలిగించింది. ఈ ఘటన వెనుక హాస్టల్ యాజమాన్యం, ముఖ్యంగా ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం ఉందని గ్రామ సర్పంచ్ రోహిత్ కన్హర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సమాచారం అందిన వెంటనే తాను స్వయంగా హాస్టల్‌కు వెళ్లి పరిస్థితిని సమీక్షించినట్లు తెలిపారు. “హాస్టల్‌లో ప్రిన్సిపాల్‌తో పాటు ఇతర ఉపాధ్యాయులు కూడా అందుబాటులో లేకపోవడం వల్లే ఇలాంటి దారుణం జరిగింది. వారు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు” అని కన్హర్ అన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు వెంటనే ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. Odisha Fevikwik Incident.

దర్యాప్తు అనంతరం సలగూడ సేవశ్రమం ప్రిన్సిపాల్ తన విధులను నిర్వర్తించడంలో నిర్లక్ష్యం వహించారని నిర్ధారించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆ ప్రిన్సిపాల్‌ను వెంటనే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఘటన తల్లిదండ్రులకు తమ పిల్లల భద్రత పట్ల భయాందోళనలను పెంచింది. పాఠశాలలు, హాస్టల్లలో విద్యార్థుల భద్రతకు సంబంధించి మరిన్ని కఠినమైన నియమాలు, నిబంధనలు తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.