‘భూ’ బంగారం.!

Raidurg Land Auction: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి దేశవ్యాప్తంగా దృష్టిని అట్రాక్ట్ చేసింది. నగరంలోని ప్రతిష్ఠాత్మక ఐటీ జోన్‌గా మారిన రాయదుర్గంలో జరిగిన భూ వేలం చరిత్ర సృష్టించింది. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌ నిర్వహించిన ఈ వేలంలో ఎకరా భూమికి రూ.177 కోట్ల గరిష్ఠ ధర పలకడం ద్వారా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ వేలంలోనూ నమోదుకాని రికార్డు స్థిరపడింది.

హైటెక్ సిటీ, గచ్చిబౌలి మధ్య వ్యూహాత్మకంగా ఉన్న ఈ రాయదుర్గం భూభాగం పెట్టుబడిదారులకు అత్యంత ప్రాధాన్యతగల ప్రదేశంగా మారింది. మియాపూర్ మెట్రో, ఔటర్ రింగ్ రోడ్ (ORR), అంతర్జాతీయ విమానాశ్రయానికి సులభ అనుసంధానం ఉండటంతో పాటు ఐటీ, కమర్షియల్, లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ రంగాలకు ఈ ప్రాంతం ఎంతో అనుకూలంగా ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఈ-వేలంలో మొత్తం 18.67 ఎకరాల భూమి అమ్ముడైంది. ఇందులో సర్వే నంబర్ 83/1లోని ప్లాట్ నంబర్ 15A2లో ఉన్న 7.67 ఎకరాల భూమిని ఎంఎస్‌ఎన్‌ (MSN) గ్రూప్ ఎకరాకు రూ.177 కోట్ల చొప్పున కొనుగోలు చేసింది. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.1,357.59 కోట్ల ఆదాయం లభించింది. అదే సర్వే నంబరులోని మిగిలిన 11 ఎకరాలను ప్రెస్టేజ్‌ రియాలిటీ సంస్థ ఒక్కో ఎకరాకు రూ.141.5 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ భూవేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు రూ.1,556.5 కోట్లు వచ్చాయి. మొత్తం 18.67 ఎకరాల భూమి, స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఫీజులతో కలిపి రాష్ట్ర ఖజానాకు రూ.3,135 కోట్ల భారీ ఆదాయం సమకూరనుంది.

ఈ భూమి హైటెక్‌ సిటీ- గచ్చిబౌలి ప్రాంతాల మధ్య ఉండడం.. మియాపూర్‌ మెట్రో, ఔటర్‌ రింగ్‌ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయానికి సులభంగా రాకపోకలు కొనసాగించేలా ఉండడం.. ఐటీ, ఐటీఈఎస్, కమర్షియల్, లైఫ్‌ సైన్సెస్, హెల్త్‌కేర్, రిటైల్, ఎడ్యుకేషన్, రెసిడెన్షియల్, హాస్పిటాలిటీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ తదితర అభివృద్ధి సంస్థలకు అనుకూల ప్రదేశంగా గుర్తింపు పొందడంతో పెట్టుబడిదారులు భారీ ధరను చెల్లించడానికి ఆసక్తి చూపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నిర్వహించిన భూవేలంలో.. 2017లో రాయదుర్గంలో 2.84 ఎకరాలకు గాను ఎకరా రూ.42.59 కోట్లు పలకగా.. 2022లో కోకాపేట నియోపోలీస్‌ వేలంలో 3.60 ఎకరాల్లో ఎకరాకు రూ.100.75 కోట్లు గరిష్ఠ ధర పలికి అప్పట్లో రికార్డు సృష్టించింది.

ఇక ఇప్పుడు తాజాగా రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలో రికార్డు స్థాయిలో ఎకరాకు రూ.177 కోట్లు.. అంటే దాదాపు 75% అధికంగా వృద్ధి సాధించినట్లు టీజీఐఐసీ ఎండీ శశాంక తెలిపారు. ‘తెలంగాణ రైజింగ్‌-2047’ దిశగా బలమైన అడుగు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సహకారంతో రాష్ట్రం పారదర్శక, వ్యాపారానుకూల, వృద్ధి ప్రాధాన్య గల వాతావరణాన్ని నిర్మిస్తోంది. పెట్టుబడిదారులు, డెవలపర్లు హైదరాబాద్‌ భవిష్యత్తుపై చూపుతున్న నమ్మకానికి ఇది నిదర్శనం. జేఎల్‌ఎల్‌ ఇండియా.. ఎంఎస్‌టీసీ సంస్థల భాగస్వామ్యంతో పారదర్శకంగా ఈ వేలాన్ని నిర్వహించాం’’ అని శశాంక చెప్పారు.

ఇక మరోవైపు కుత్బుల్లాపూర్‌ పరిధిలోని చింతల్‌లో నివాస భూములు రికార్డు స్థాయి ధరలు పలికాయి. బహిరంగ వేలంలో చదరపు గజం రూ.1.14 లక్షలు పలికింది. 513 చ.గజాల విస్తీర్ణంలోని హెచ్‌ఐజీ ఓపెన్‌ ప్లాట్‌కు ఆఫ్‌సెట్‌ ప్రైస్‌ చ.గ. రూ.80 వేలు నిర్ణయించగా.. రూ.1.14 లక్షలకు కొనుగోలు చేశారు. హెచ్‌ఐజీలోనే మరో ప్లాట్‌ను చదరపు గజానికి రూ.లక్ష చొప్పున కొన్నారు. సోమవారం మొత్తం 18 ఓపెన్‌ ప్లాట్లు, 4 ఫ్లాట్లకు బహిరంగ వేలం వేయగా హౌసింగ్‌ బోర్డుకు రూ.44.24 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు వైస్‌ ఛైర్మన్‌ వీపీ గౌతం తెలిపారు. 27 మంది బిడ్డర్లు పాల్గొన్న వేలంలో చదరపు గజానికి సగటున రూ.91,947 ధర దక్కింది. Raidurg Land Auction.

రియల్ ఎస్టేట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాయదుర్గం, గచ్చిబౌలి, కోకాపేట వంటి ప్రాంతాలు భవిష్యత్‌లో దేశంలోని ప్రధాన ఐటీ, లైఫ్ సైన్సెస్, హెల్త్ టెక్ హబ్‌లుగా రూపుదిద్దుకునే అవకాశముంది. తాజా రికార్డు ధరలు హైదరాబాద్‌ మార్కెట్‌పై పెట్టుబడిదారుల నమ్మకాన్ని మరింత బలపరిచాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.